సంపాదకీయం
విద్య ద్వారానే సామాజిక న్యాయం, ఆర్థిక స్వాలంభన, రాజ్యాధికారం లభిస్తుందని భాగ్యరెడ్డి వర్మ, మహాత్మ జ్యోతిరావ్ ఫూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ నుండి నేటి వరకు అనేక మంది సామాజికోద్యమనాయకులు బోధిస్తూనే ఉన్నారు. మతం పేరుతో దళిత, గిరిజన, బలహీన వర్గాల పేదలను విద్యకు దూరం చేశారు ఆనాటి పాలకులు. నేటి లౌకిక, ప్రజాతంత్ర స్వాతంత్య్రం వచ్చి 68ఏళ్ళు గడిచిన తరువాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పూర్తి స్థాయిలో ప్రాధమిక విద్యను అందించలేక పోతున్నారు ఈనాటి పాలకులు.
దళితులను పాఠశాలలో చేర్చుకోవడానికి అగ్రకులాలు నిరాకరించే వ్యవస్థను గమనించిన భాగ్యరెడ్డి వర్మ 'పష్తక్వామ్' (డిప్రెస్డ్) పాఠశాలలను ఏర్పాటు చేసి సామాజిక విద్యా విప్లవానికి పూనాదులు నిర్మించారు. ''విద్య ద్వారానే విజ్ఞానం, విజ్ఞానం ద్వారా వివేకం, వివేకంతో అభివృద్ధి, అభివృద్ధి లేకనే అంధకారం, అంధకారానికి కారణం విద్య లేకపోవడమే'' అని విద్య ప్రాధాన్యతను నొక్కి చెప్పిన మహాత్మా జ్యోతిరావ్ ఫూలే అంటరానివారికి, మహిళలకు సత్యశోధక్ పాఠశాలలు ఏర్పాటు చేశారు. అనాటి నుండి నేటి వరకు విద్య కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విద్య వ్యాప్తి కోసం పడిన శ్రమ రాజ్యాంగం రూపంలో మన ముందుకు వచ్చింది. కానీ పాలకుల మనుధర్మ విధానాల ముందు రాజ్యాంగ ఆశయాలు అనతికాలంలోనే గాల్లో దీపంలా కదిలిపోయాయి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 65 సంవత్సరాల తరువాత విద్యాహక్కు చట్టం చేసిన పాలకులు, దీనిని అమలు చేయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితి. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించకుండా విద్యార్థులు లేరనే సాకుతో మూసివేస్తున్నారు. దళితవాడలు, గిరిజన తండాల్లో ఉన్న 80 శాతం పాఠశాలలు మూసివేసి ఈ వర్గాలకు విద్య అందకుండా చేస్తున్నారు. విద్యను కొనుగోలు సరుకుగా మార్చి వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను దూరం చేస్తూ, ప్రయివేటు పాఠశాలల దగ్గరకు చేరుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ''ప్రథమ్'' నివేదిక, సుప్రీంకోర్టు సూచనలను అమలుకు పూనుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది.
ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని, లేనిపక్షంలో ప్రయివేటు- కార్పోరేట్ స్కూల్స్కు చెల్లించే ఫీజులకు సమానంగా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు చెల్లించాలని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. కానీ మన పాలకులకు హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను అమలుపరిచే తీరిక లేదు. కావున సుప్రీంకోర్టు ద్వారానైనా విద్య యొక్క ప్రాధాన్యతను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన తక్షణ అవసరం ఎంతైనా ఉన్నది.

No comments:
Post a Comment