Tuesday, August 1, 2017

సంపాదకీయం - August 2017 -DSMM



ఉత్తరాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా గుజరాజ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో గోసంరక్షణ పేరుతో గోరక్షక దళాలు దళితులు, ముస్లింలపై అత్యంత భయంకరంగా, అమానవియంగా, ఐఎస్‌ఐ టెర్రరిస్టులకు ఏ మాత్రం తీసి పోని విధంగా దాడులు చేస్తూ, హత్యలు గావిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అగ్ర కులాలు బూటకపు పరువు పేరు మీద ప్రేమించి పెళ్ళి చేసుకున్నందుకు (పెద్దపల్లి మంథని మధుకర్‌, నిజామాబాద్‌ జిల్లా అమాద్ర్‌లో రోజా, భువనగిరిలో నరేష్‌-స్వాతి, వికారాబాద్‌ జిల్లా తాండూరులో) హత్యలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనైతే దళితులపై ఉన్న అసూయా ద్వేషంతో దళిత సమాజానికి దిక్సూచి అయిన బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌పై తమ ప్రతాపం చూయిస్తున్నారు. అంబేడ్కర్‌ విగ్రహం పెట్టుకోవడమే నేరంగా భావించి అత్యంత అమానుషమైన సాంఘిక బహిష్కరణ గావించారు. 75 సం.రాల స్వతంత్య్ర భారతదేశంలో ఎస్సీ, ఎస్టీలకు స్వాతంత్య్ర ఫలాలు అందకపోవడం వలనే ఆర్థికంగా బలహీనపడటమే కాక సామాజిక చైతన్యాన్ని పెంచుకోలేకపోయారు. వీటికి కారణం ఒక్కసారి విశ్లేషించు కుందాం.
ప్లాటినం ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలు మేము ఈ దేశ పౌరులమేనా? ఈ వర్గాలకు చెందిన వ్యక్తి డాక్టర్‌ అంబేడ్కర్‌ వ్రాసిన రాజ్యాంగం ఈ వర్గాలకు అమలు జరుగుతుందా? దేశంలో ఏదోఒక్కచోట కులపరంగా, మతపరంగా, వర్గం పేరుమీద దాడులు, అణచివేత ఎందుకు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పెద్దఎత్తున పెచ్చర్లిటానికికారణం ఏమిటి? దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ విభాగం అయినటువంటి భారతీయ జనత పార్టీ దాని మిత్ర పక్షాలు అధికారంలోకి రావటమే కారణమా? దేశవ్యాప్తంగా దళిత వర్గాలన్నింటికి చేయూత నిచ్చి పోరాటానికి సిద్ధంగా ఉండే కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడటమే కారణమా? బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆలోచన విధానంతో రాజ్యాధికారమే ధ్యేయంగా ఏర్పడిన బహుజన సమాజ్‌ పార్టీ పూర్తిగా పట్టుకోల్పోడమే కారణమా? గతంలో దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ ప్రదేశ్‌లో నాలుగుసార్లు అధికారం చేజిక్కించుకున్న బిఎస్సీ అదే ఉత్తర్‌ ప్రదేశ్‌లో 17 స్థానాలకు దిగజారటం, లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం, ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాల తోపాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో గతంలో అసెంబ్లీలో బిఎస్పీకి ప్రతినిధ్యం ఉండేది, ఇప్పుడు అది లేకుండా పోవడమే కారణమా? అదే విధంగా పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు అధికారం కోల్పోవటం.... తదితర కారణాలతోనే ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ శక్తులు చేలరేగుతున్నాయా? 
ఇప్పటికైనా కమ్యూనిస్టు పార్టీల నాయకులు గానీ, డాక్టర్‌ అంబేడ్కర్‌ భావజాలంతో పని చేస్తున్న ఆయా పార్టీల నాయకులు గానీ జరుగుతున్న పరిణామాల మీద ఆలోచించవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

- బి. గంగాధర్, ఎడిటర్, దళితశక్తి మాస పత్రిక 



No comments:

Post a Comment

Dalithashakthi - 2025 - Magazines