Wednesday, December 27, 2023

2024 New Year Wishes

2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు



 

Thursday, December 7, 2023

డిసెంబర్‌ 2023 మాసపత్రిక

 డిసెంబర్‌ 2023 మాసపత్రిక



  • తెలంగాణలో అధికారం మార్పు? 

  • బర్రెలక్క (శిరీష) తెగువతో... ప్రజాస్వామ్యంలో నూతనాధ్యాయం

  • మనుసాహిత్యాన్ని చీల్చి చెండాడిన.. ప్రపంచ సాహితీవేత్త బాబాసాహెబ్‌

  • అసమానతలు తొలగినప్పుడే... అసలైన అభివృద్ధి

  • అధికారంలోకి ఏ పార్టీ వచ్చిన... సంక్షేమం ప్రజల హక్కుగా మారాలి

  • కులగణనతో అసమానతలపై కొత్త పోరు

  • భ్రమలో బతుకుతున్న మనిషి

  • వైద్యం... అందరికీ దక్కని భాగ్యం

  • ఉద్యమకారుడి పాలనలో...ఆకాంక్షలు-అణచివేతతో గాడి తప్పిన పాలన

  • కొత్త చట్టాలు.. కొత్త సమస్యలు

  • అఖిల భారత న్యాయసేవ అవసరం

  • ఈ మట్టిని గౌరవిద్దాం

Thursday, November 30, 2023

తెలంగాణ ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత మూడవసారి జరుగుతున్న ఈ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,26,18,205 మంది ఓటర్లలో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,705 మంది మహిళలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీల వారిగా అధికార బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ 119, బిజెపి 111, బిఎస్‌పి 107, ఎంఐఎం 9, సిపియం 19, జనసేన 8, సీపీఐ 1 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఏడుగురు ఎమ్మెల్యేలు, 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అయిదుగురు ఎమ్మెల్యేలతోపాటు 1,779 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 2,068 మంది పురుషులు, 221 మంది మహిళలు, 1 ఎన్నికల ట్రాన్స్‌జెండర్ ఈ బరిలో ఉన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో దివ్యాంగుల కోసం 120, మహిళల కోసం 597. మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు 644 ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 638, భద్రాచలం నియోజకవర్గంలో అతితక్కువగా 176 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 13 అసెంబ్లీ నియోజకవర్గాలు, 12,311 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్‌ను ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పరిమితం చేసింది. దాదాపు 27,051 చోట్ల ఓటింగ్‌ ప్రక్రిన్యను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. రాష్ట్రంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 7,32,560 మంది ఓటర్లు ఉంగా భద్రాచలంలో 1,48,713 మంది మాత్రమే ఉన్నారు. ఎబ్బీనగర్‌ నియోజనవర్గంలో అత్యధికంగా 48 మంది అభ్యర్థులు, బాన్సువాడ, నారాయణపేట నియోజకవర్గాల్లో అతితక్కువగా ఏడుగురు చొప్పున పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా 55 నియోజకవర్గాల్లో ఒక్కో బ్యాలెట్ యూనిట్, 54 నియోజకవర్గాల్లో రెండు, 10 నియోజకవర్గాల్లో మూడు చొప్పున బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నారు.

ముచ్చటగా మూడో ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు తెలంగాణ సిద్ధమైంది. రాష్ట్రం ఏర్పడ్డాక హౌరాహౌరీగా సాగుతున్న తొలి త్రిముఖ పోరులో అధికార భారాసకు విపక్ష కాంగ్రెస్‌, భాజపాలు తీవ్ర పోటీనిస్తున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌లాంటి ఐదురాష్ట్రాల అసెంబ్లీల సమరాంగణంలో ఇదే చివరి పోరు...! రాష్ట్రం సాధించి, తొమ్మిదిరేళ్లుగా ఎంతో అభివ ద్ధి చేశామంటున్న అధికార పార్టీ ఒకవైపు, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని, ఒక్కసారి ఆదరించాలని కోరుతున్న ప్రతిపక్ష పార్టీ మరో వైపు, డబుల్ ఇంజిన్‌ సర్కారుకు మద్దతివ్వాలంటున్న అధికార పార్టీ ఇంకోవైపు. ఇలా ద్విముఖ, త్రిముఖ పోటీలో తమ తీర్పును ఈవీఎంలలో ఓటర్లు నిక్షిప్తం చేస్తున్న రోజు ఇది. చైతన్యానికి మారుపేరుగా నిలిచిన తెలంగాణ ఓటర్లు ఉన్న ప్రభుత్వాన్నే కొనసాగిస్తారా? మార్పును కోరుకుంటారా? లేక త్రిశంకును తీర్మానిస్తారా? ... ఫలితం ఏదైనా ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి ఓటున్న ప్రతి ఒక్కరూ ఇంట్లోంచి కాలు కదిలించి... ఈవీఎంలపై వేలు మీటే విద్యుక్త ధర్మం నెరవేర్చాల్సిందే! మరి పదండి పోలింగ్‌కు... 

- B Gangadhar, Editor

Monday, November 6, 2023

 ఈ నెల 6వ తేదిన నవంబర్‌ 2023 సంచికను పోస్ట్‌ ద్వారా పంపడం జరిగింది. పత్రిక రాని వారు 15 తేది తర్వాత ఫోన్‌ లేదా వాట్సాఫ్‌ ద్వారా సంప్రదించగలరని విజ్ఞప్తి. 

Wednesday, November 1, 2023

జాతి తలరాతను మార్చేది... ఓటు

 జాతి తలరాతను మార్చేది... ఓటు


ఓటుహక్కుపై దేశవ్యాప్తంగా యువజనులకు సరైన అవగాహన ఉండటం లేదు. 'పద్దెనిమిదేళ్లు వచ్చాక మారుతున్నవారిలో ప్రజాస్వామ్య చైతన్యం పెద్దగా కనపడటం ఎందుకు ఓటేయాలి? ఎవరికి ఓటేయాలి? వంటి విషయాల్లో వారు మానసికంగా సిద్ధం కావడం లేదు' అన్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) రాజీవకుమార్‌ తాజా వ్యాఖ్యలు అక్షరసత్యాలు. అర్హులు అందరికీ ఓటుహక్కు కల్పించి, వారిని పోలింగు కేంద్రాలకు రప్పించడంలో ఈసీ వర్గాలు చేతులెత్తేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఓటు విలువను విద్యార్థులకు తెలియజెప్పేందుకు తొమ్మిదో తరగతి నుంచి ప్రజాస్వామ్య పాఠాల బోధనకు సంసిద్ధమవుతున్నట్లు సీఈసీ ప్రకటించారు. అది యధారీతిన మూసపద్ధతిలోనే చెబితే ప్రజాస్వామ్యంలో ఓటరు పాత్ర ఏమిటో నవతరానికి బోధపడదు. మంచివాళ్లు ఓటింగ్‌కు దూరంగా ఉండటం- చెడ్డ ప్రభుత్వాల ఏర్పాటుకు దారితీస్తుందన్నది. మాజీ సీఈసీ శేషన్‌ హెచ్చరిక. భావితరానికి అది అవగతమయ్యేలా పాఠ్యాంశాలను రూపొందించాలి. నిర్దేశిత వయసులో ఓటర్లుగా నమోదు కావడం, ఓటుహక్కును విచక్షణాయుతంగా వినియోగించుకోవడం... ఇలా అన్ని అంశాలనూ ఆసక్తికర శైలిలో విద్యార్థులకు విడమరచాలి. అప్పుడే ఎన్నికల సంఘం ఆకాంక్ష వాస్తవ రూపం దాలుస్తుంది.

లోక్‌సభకు మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు (1951-52 దేశీయంగా ఓటర్ల సంఖ్య 17.32 కోట్లు. 2023 ఫిబ్రవరి నాటికి అది 94.50కోట్లకు చేరినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జనాభాకు తగినట్లు కాలక్రమంలో ఓటర్లు అధికమైనా, పోలింగ్‌ శాతంలో పెరుగుదల మాత్రం మరీ ఎక్కువగా ఏమీలేదు. తొలి సార్వత్రిక సమరంలో 45.67శాతం ఓటింగ్‌ జరిగితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో అది 67.40శాతంగా లెక్కతేలింది. ఈసీ పరిశీలన ప్రకారమే- అర్హులైన వారిలో 30కోట్ల మంది ముఖ్యంగా పట్టణ ప్రాంతీయులు, యువత, వలస కార్మికులు గత సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. పొట్ట చేతపట్టుకుని పరాయి ప్రాంతాలకు వెళ్ళే శ్రమజీవుల హక్కులను పరిరక్షించడంలో వ్యవస్థాగత వైఫల్యాలు ఒకపక్క వెక్కిరిస్తున్నాయి. మరోవైపు ఉన్నత విద్యావంతులు, అధికాదాయ వర్గాల నిరాసక్తత కారణంగా నగరాల్లో పోలింగ్‌ శాతాలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. అవగాహన రాహిత్యంతో పాటు తామొక్కరం ఓటు వేయకపోతే కొంపలేమి మునిగిపోతాయన్న అలక్ష్యంతో పోలింగ్‌ కేంద్రాల వైపు కన్నెత్తి చూడని యువతీయువకులూ గణనీయంగానే ఉంటున్నారు. అవతలి వ్యక్తుల కంటే ఒక్క ఓటు అదనంగా పొందగలిగితే చాలు, వారినే విజేతలుగా నెత్తిన పెట్టుకునే ఎన్నికల వ్యవస్థ మనది. కాబట్టి ఓటింగ్‌కు ఏ కొందరు గైర్హాజరైనా అభ్యర్థుల జాతకాలే తలకిందులవుతాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌. కెన్నెడీ హెచ్చరించినట్లు, ప్రజాస్వామ్యంలో ఒక ఓటరు అజ్ఞానం- మిగిలిన వారందరి భద్రతనూ ప్రమాదంలో పడేస్తుంది. యువత దీన్ని అర్ధం చేసుకోవాలి. తమ భవితను తామే నిర్దేశించుకోవాలంటే ప్రజాస్వామ్య యజ్ఞంలో వారు పాలుపంచుకుని తీరాలి. వెగటు పుట్టిస్తున్న ధన, రౌడీ రాజకీయాలతో పరువుమాస్తున్న ఎన్నికల ప్రక్రియను ఏవగించుకునే వారూ లేకపోలేదు. జనాన్ని ముందుండి నడిపించిన జాతినేతల దేశభక్తే భారతావనికి స్వాతంత్య్రాన్ని సముపార్జించి పెట్టింది. అదేవిధంగా అవినీతి అక్రమాల చెరలోంచి జనస్వామ్యానికి స్వేచ్ఛ ప్రసాదించగలిగే ప్రజా ఉద్యమానికి యువతే నేడెందుకు నేతత్వం వహించకూడదు? ప్రజాసంక్షేమానికి పాటుపడని నేతలను నిగ్గదీయడమే కాదు. అటువంటి వారిని శంకరగిరి మాన్యాలు పట్టించే శక్తిని తమకు సమకూర్చేది ఓటుహక్కేనని యువత గుర్తించాలి. దేశం తలరాతను మార్చిరాసే విధాతలుగా వారు అవతరించాలి?

Tuesday, October 31, 2023

నీవే లేకుంటే...

 నీవే లేకుంటే...

నీవే గనుక లేకుంటే
మా బతుకులు ఇప్పటికీ
తెల్లారేవే కావు!
మూతికి ముంత, ముడ్డికి ఆకు
అలానే వ్రేళ్ళాడుతుండేవి!
తలలు పంకించి, చేతులు ముడుచుకుని
దిక్కులు వెతుక్కుంటూ ఉండేవాళ్ళం! 
ఇప్పటికి కొంకొణ ప్రాంత రైతులు
బిత్తర బిత్తరగా బ్రతికే వారు!
కార్మికులు యంత్ర బాహువులకి చిక్కి
నలిగి బూడిదయ్యేవారు!
ఓటు మొగమే చూసే వారం కాదు.
బడి గడప తొక్కేవాళ్ళమే కాదు!

నీవే గనుక లేకుంటే
గుక్కెడు నీళ్ళ కోసం
అలమటించాల్సి వచ్చేది!
గుప్పెడు మెతుకుల కోసం
అల్లాడాల్సి వచ్చేది!
మహద్‌ సత్యాగ్రహం చేసి
మా బతుకుల్లో వెలుగు పంచావు!
మనుధర్మ శాస్త్రాన్ని తగుల బెట్టి
మాలో ఆత్మ విశ్వాసం నింపావు!


నీవే గనుక లేకుంటే
దేవాలయాల గడప తొక్కనిచ్చేవారే కాదు!
పతనార్ల జీవితాల్లో
సంతోషం వెల్లువిరిసేదే కాదు!
శ్రామికుల బతుకుల్లో
నవ్వులు విరబూసేవే కాదు!

నీవే గనుక లేకుంటే
ఈ దేశానికి రాజ్యాంగం
ఎవరు రాయగలిగేవారు?
అంత పెద్ద బాధ్యతను
ఎవరు తలకెత్తుకొనగలిగేవారు
ఈ దేశంలో బౌద్ధాన్ని
ఎవరు పునరుద్ధరించగలిగే వారు?

నీవు పుట్టి ఉండకపోతే
నిమ్నజాతుల మనుగడ ప్రశ్నార్థకమయ్యేది
అస్పశ్యుల వెతలు
ఆరని కాష్టంలా రగులుతూ ఉండేవి!

దళిత బాంధవా! బాబాసాహెబా!
నీ నుంచి స్వాభిమానం అబ్బింది
నీ నుంచి వ్యక్తిత్వం అలవర్చుకున్నాం!
ధైర్యస్థైర్యాలను, ఆత్మ విశ్వాసాన్ని
నీ నుంచే చేజిక్కించుకున్నాం!!

అసలు నువ్వు లేకుండా ఉంటే?
ఈ ప్రశ్న అవసరం లేదు!
నువ్వు మా కోసం పుట్టావ్‌!
నీ జన్మ యుగధర్మానిధి!
నువ్వు మా యుగపురుషుడివి!
నువ్వు కారణజన్ముడివి!!

-డా|| గూటం స్వామి

నవంబర్‌ 2023 దళితశక్తి తెలుగు మాసపత్రిక

 నవంబర్‌ 2023 దళితశక్తి తెలుగు మాసపత్రిక

  • అసెంబ్లీ నియోజకవర్గాలు
  • జాతి తరరాతను మార్చేది.. ఓటు
  • ఆత్మగౌరవ పాలన ఎక్కడీ 
  • నీవే లేకుంటే... 
  • ఎన్నికల సందడి
  • ఓటరు... తస్మాత్‌ జాగ్రత్త
  • భయంకరంగా నిరుద్యోగ సమస్య 
  • కులగణన సామాజిక అవసరం 
  • మనిషి చుట్టూ ముసురుకుంటున్న అజ్ఞానం
  • బౌద్ధ తాత్విక పత్రం 
  • ఊరికొకరు కావాలి 
  • దేశ ప్రగతికి విఘాతం 
  • ప్రజల ఆరోగ్యం ఏమయ్యేట్టు? 
  • వారు గొప్పోళ్ళు... 

Friday, October 27, 2023

చందాదారులకు విజ్ఞప్తి



దళితశక్తి మానపత్రిక తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ, అభిమానం సంపాదించుకుని అత్యధిక సర్క్యులేషన్‌ కలిగి ఉన్నది. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌, జ్యోతిరావ్‌ ఫూలే, మాన్యశ్రీ కాన్షీరాంల ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి నిరంతరం కషి చేస్తున్నది. ఇప్పటి వరకు అనేక పత్రికలు వచ్చాయి, పోయాయి. ఎందుకంటే ఆర్ధిక వనరులు లేక ఆ పత్రికలు నిలబడలేకపోయాయి. ఈ పోటీ ప్రపంచంలో ప్రింట్‌ మీడియా రంగంలో ఉన్నటువంటి పత్రికలకు మీ వంతు సహాయ, సహకారాన్ని చందాలు, ప్రకటనలు, విరాళాల రూపంలో అందించి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము. మన పత్రికలను మన వారే ప్రోత్సహించకపోతే ఇతరులెవరూ కొంటారు? ఇతరులెవరూ ప్రోత్సహిస్తారు? మన ప్రయోజనాల కోసం నిబద్ధతతో నడిచే పత్రికకు దళిత, బహుజన ప్రజలు, ఉద్యోగులు, నాయకులు చందాలు, ప్రకటనలు, విరాళాలు అందించి ముందుకు నడిపిస్తారని, నడిపించాలని దళితశక్తి మాసపత్రిక విజ్ఞప్తి చేస్తున్నది.

చందాల వివరాలు: 


కాల పరిమితి ధర తగ్గింపు ధర 

సంవత్సర         రూ.  600 రూ.  500

రెండు సంవత్సరాలు                            రూ. 1200                                రూ.  1000

మూడు సంవత్సరాలు                        రూ. 1800         రూ.  1500

నాలుగు సంవత్సరాలు రూ. 2400 రూ.  2000

ఐదు సంవత్సరాలు రూ. 3000 రూ.  2500

పది సంవత్సరాలు రూ. 6000 రూ.  3000

జీవితకాలం రూ. 10000 రూ.  5000



Scan amd Pay




Wednesday, September 6, 2023

ప్రజాయుద్ధ నౌక గద్దర్‌

 'నీ పాదం మీద పుట్టమచ్చయ్యి'...'పొడుస్తున్న పొద్దుమీద కాలమై నడిచిన'...

ప్రజాయుద్ధ నౌక గద్దర్‌


గద్దర్‌ పాటలపొద్దు గూకింది. 'అమ్మా తెలంగాణమా' అంటూ చేసిన 'ఆకలి కేకల గానం' అర్ధంతరంగా మూగ బోయింది. దగాపడిన బతుకుల పక్షాన 'మర్లవడ్డ రాగం'.. మరలిరాని లోకాలకేగింది! కష్టజీవుల కన్నీళ్ల విలువ తెలిసి, శ్రామికుల స్వేదం లెక్కగట్టలేమని పసిగట్టి, గోచీగొంగడి కట్టి, కర్రచేతబట్టి, కాలి గజ్జెకట్టి, కైగట్టి పోరుదారిలో నడిచిన పొద్దు అస్తమించింది! 'బండెనక బండిగట్టి' పాటమ్మను పల్లె పల్లెనా ఊరేగించిన ప్రజా యుద్ధనౌక అంతర్ధానమైంది. గుండెల్లో తూటాను దాచుకున్న పాట.. స్వతంత్ర పాలనకై, కుతంత్ర పాలనపై తూటాయై పేలిన పాట.. తెలంగాణ తల్లి 'పాదం మీద పుట్టమచ్చయ్యి', పొడుస్తున్న పొద్దుమీద కాలమై నడిచిన పాట.. మధ్యలోనే ఆగిపోయింది. ఆ పాట పేరు గద్దర్‌. ముందు వెనకా ఏ విశేషణాలూ అక్కర్లేని మూడు అక్షరాల 'చేతన' గద్దర్‌. అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు. ఆశువుగా పదాలల్లి, పాటల ఈటెలెత్తి కోట్లమంది గొంతుకై ఊరూరా ఉద్యమాన్ని ఉరకలెత్తించిన తొలితరం ప్రజా గాయకుడు ఇక లేరన్న వార్త అభిమాన లోకాన్ని దుఃఖ సాగరంలోకి నెట్టివేసింది. గద్దర్‌గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్‌ రావు విప్లవ కవి. ఈయనకు గద్దర్‌ అను పేరును స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్‌ రాజ్యాన్ని వ్యతిరేకించిన ''గదర్‌ పార్టీ''కు గుర్తుగా తీసుకోవడం జరిగింది.

జీవిత విశేషాలు
గద్దర్‌ మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1948లో దళిత కుటుంబంలో జన్మించాడు.విద్యాభ్యాసం నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లో, ఇంజనీరింగ్‌ విద్య హైదరాబాద్‌లో జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమం లో గద్దర్‌ చురుగ్గా పాల్గొన్నాడు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేసారు. దీనికొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నాడు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్‌ సింగ్‌ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఆతర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వాడు. 1971లో సినీ దర్శకుడు ప్రోత్సాహంతో 'ఆపర రిక్షా' అనే మొదటి పాట రాశారు. అలా మొదటి ఆల్బంకు గద్దర్‌ అనే పేరు పెట్టారు. ఆ పేరే స్థిరపడి పోయింది. ఆ తర్వాత మద్యపాన నిషేధం, తునికాకు, రైతు కూలి రెట్ల పెంపు, అక్షరాస్యత, కుటుంబ నియంత్రణ, పారిశుద్ధ్యం వంటి సామాజిక అంశాలపై గద్దర్‌ బుర్రకథలు ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. బుర్రకథ లతోపాటు పాటలు కూడా రాసి, సొంతంగా పాడారు.

1975లో గద్దర్‌ బ్యాంకు రిక్రూట్‌ మెంట్‌ పరీక్షను రాసాడు. అయన కెనరా బ్యాంకులో క్లార్క్‌గా చేరాడు, తర్వాత అతను విమలను వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు, సూర్యుడు, చంద్రుడు (2003లో అనారోగ్యంతో మరణించారు), వెన్నెల. 1984లో ఆయన క్లర్కు ఉద్యోగానికి రాజీనామా చేసాడు. 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడాడు. జన నాట్య మండలిలో చేరాడు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళాడు. గద్దర్‌ పాట పాడితే మారుమూల పల్లెల్లో వినిపిస్తుంది.

పాటలతోనే ప్రత్యేక గుర్తింపు...
నిజాం పాలనకు వ్యతిరేకంగా వచ్చిన మా భూమి సినిమాలో గద్దర్‌ సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించారు. 'బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లే పోతవు కొడుకో నైజాము సర్కరోడా' అనే పాటను గద్దర్‌ స్వయంగా పాడి గజ్జె కట్టి ఆడారు. ఈ పాట తెలుగు జాతిని కదిలించడంతోపాటు గద్దర్‌కు విశేష గుర్తింపు తెచ్చింది. 1971లో సినీ దర్శకుడు ప్రోత్సాహంలో 'ఆపర రిక్షా' అనే మొదటి పాట రాశారు. అలా మొదటి ఆల్బంకు గద్దర్‌ అనే పేరు పెట్టారు. ఆ పేరే స్థిరపడి పోయింది. 'సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో.. లచ్చుమమ్మో..' అని దళితుల దైన్యాన్నిపాటలో వివరించారు గద్దర్‌. తన పాటలను తన బందంతో కలిసి క్యాసెట్లు, ఆల్బమ్స్‌, సీడీలుగా చేసి ప్రజలను చైతన్యం చేశారు. గద్దర్‌ గళం వినిపించిందంటే వేలాదిగా క్యాసెట్లు, సీడీలు అమ్ముడు పోయేవి. 1980 దశకంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా గద్దర్‌ పాటలే వినిపించేవంటే అతిశయోక్తి కాదు.

ఉద్యోగం వదిలి.. విప్లవం వైపు కదిలి
1984లో ఆయన క్లర్కు ఉద్యోగానికి రాజీనామా చేసాడు. 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడాడు. జన నాట్య మండలిలో చేరాడు. ప్రజలపై జరుగుతున్న అకత్యాలను, అణచివేతలను ఎదుర్కొనేందుకు నక్సలైట్‌ ఉద్యమం పుట్టిందని భావించే వారు గద్దర్‌. నక్సలైట్ల ఉద్యమానికి సానుకూలంగా పాటలు పాడేవారు. 'మల్లె తీగకు పందిరి వోలె..' అంటూ సాగే ఒరేరు రిక్షా సినిమాలోని పాటకు గద్దర్‌కు రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు ప్రకటించగా గద్దర్‌ తిరస్కరించారు. గద్దర్‌ రాసిన అనేక పాటలు సినిమాల ద్వారా ప్రజలను చైతన్యం చేశాయి. ప్రత్యేకించి ఆర్‌.నారాయణ మూర్తి నిర్మించే విప్లవ నేపథ్యంలో సాగే అనేక సినిమాలకు గద్దర్‌ పాటలు రాశారు.
కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకథ లను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవాడు. ఆ తర్వాత అతను అనేక పాటలు రాసాడు. 1972లో పల్లెల్లో జరుగు తున్న ఆకత్యాలను ఎదురించేందుకు, దళితులను మేల్కొలిపేందుకు, వారిని చైతన్య పరిచేందుకు అనేక పాటలు రాసి పాడారు గద్దర్‌.
2011లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కిన జై బోలో తెలంగాణ చిత్రంలో గద్దర్‌ రాసిన 'పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగానమా' అనే పాట ఉద్యమంలో మరింత ఊపు నిచ్చింది. అదే సినిమాలో వెండితెరపై తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూత లూగించారు. 2019లో ఓ సినిమాకు పాట రాయడంతోపాటు చివరగా ఉక్కు సత్యాగ్రహం చిత్రంలో నటించారు.

సినిమారంగం
మాభూమి సినిమాలోని బండెనక బండి కట్టి అనే పాటను పాడడంతోపాటు పాటలో నటించాడు. ఆయన రాసిన పాటల్లో ''అమ్మ తెలంగాణమా'' అనే పాట బహుల ప్రజాదరణ పొందింది. తెలంగాణా లోని అన్ని అంశాలను స్పశిస్తూ సాగింది ఈ పాట. ఆయన రాసిన ''నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ'' అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది అయితే ఆయన ఆ అవార్డును తిరస్కరించారు. ఆయన మరోసారి జై బోలో తెలంగాణా సినిమాలో తెరపైన కనిపించాడు. 'పొడుస్తున్న పొద్దూ' మీద పాట ఆయనే రాసి పాడి, అభినయించారు. ఈ పాట అద్భుత విజయం సాధించింది. ఈ పాటకు నంది అవార్డు సైతం వచ్చింది. అలాగే ఆయన రాసి పాడిన 'అమ్మా తెలంగాణ ఆకలికేకల గానమా' పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా రాష్ట్ర సర్కార్‌ ఎంపిక చేసింది. 2016 లో దండకారణ్యం మూవీ, 2022లో విడుదలైన మెగాస్టార్‌ చిరంజీవి సినిమా 'గాడ్‌ ఫాదర్‌'లో గద్దర్‌ కీలక పాత్రలో కనిపించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నేపథ్యంలో తీసిన ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాలో గద్దర్‌ కీలకపాత్ర పోషించారు. ఇదే గద్దర్‌ నటించిన చివరి సినిమా. 1995లో నంది ఉత్తమ గీత రచయితగా ఒరేరు రిక్షా సినిమాలోని ''మల్లెతీగకు పందిరి వోలె'' పాట రచన... కానీ ఆయన అవార్డును తిరస్కరించాడు. 2011లో నంది ఉత్తమ నేపథ్య గాయకులు (జై బోలో తెలంగాణ సినిమాలోని ''పొడుస్తున్న పొద్దు మీద'' పాట) ఈశ్వరీబాయి మెమోరియల్‌ సెంచరీ అవార్డు.

మాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనక బండి కట్టి అనే పాటను ఆయనే పాడి, ఆడాడు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళాడు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిషా, బీహార్‌ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. కింద గోచి ధోతి, పైన గొంగళి ధరించేవాడు. ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంటాయి. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన, ఆయన బందం కళ్ళకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియ జెప్పేవారు. ఆయన పాటలు వందలు, వేల కాసెట్‌లుగా, సిడిలుగా రికార్డ్‌ అయ్యి అత్యధికంగా అమ్ముడు పోయాయి. 2010లో కలకత్తాలో జరిగిన ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌కు వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమంలో గద్దర్‌ ప్రదర్శన మర్రి చెన్నారెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్స్‌పై ఆయన ఉదారంగా వ్యవహరించాడు, వారిపై నిషేధం ఎత్తి వేయబడింది. 1990 ఫిబ్రవరి 18న జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్‌ హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారి భహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు.

గద్దర్‌పై కాల్పులు.. శరీరంలోకి ఆరు బుల్లెట్లు..
1997 ఏప్రిల్‌ 6న ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గద్దర్‌పై కాల్పులు జరిపారు. ఆయన శరీరంలోకి ఆరు బుల్లెట్లు దిగాయి. వైద్యులు ఆపరేషన్‌ చేసి తూటాలు తొలగించినా, వెన్నుపూస భాగంలో ఒక్క బుల్లెట్‌ మాత్రం అలాగే ఉన్నది. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. తుదిశ్వాస విడిచే వరకు ఆయన దేహంలోనే ఆ బుల్లెట్‌ ఉండి పోయింది. తనపై జరిగిన హత్యా యత్నాన్ని వర్ణిస్తూ 'మీ పాటనై వస్తున్నానమ్మో..' అంటూ పాటకు మరణం లేదని, పోరాటమే పాట లక్ష్యమని గద్దర్‌ వర్ణించారు. విప్లవ రచయితల సంఘం ద్వారా ప్రజలను చైతన్య పరిచారు. 2002లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్‌ గద్దర్‌, వరవరరావులను తమ దూతలుగా పంపారు. నకిలీ ఎన్‌కౌంటర్‌లను ఆయన తీవ్రంగా నిరసించాడు.

తెలంగాణ ఉద్యమంలో
తెలంగాణ ఉద్యమం పునరుద్ధరించడంతో, గద్దర్‌ మరోసారి వెనుకబడిన కులాలు, నిమ్న కులాల ఉద్ధరణ ఉద్దేశంతో ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం తన మద్దతును తెలపటానికి ప్రారంభించాడు. బలమైన కమ్యూనిస్ట్‌ భావజాలం ఉన్నప్పటికీ, అతను ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని వ్యతిరేకించే భారతదేశంలోని కొన్ని కమ్యూనిస్ట్‌ పార్టీలతో తన భావాలను పంచుకోలేదు.గద్దర్‌ మొదటి నుండి తెలంగాణా వాదే. దేవేందర్‌గౌడ్‌ నవ తెలంగాణా పార్టీ పెట్టినప్పుడు ఆయనకు కూడా మద్దతు తెలిపారు గద్దర్‌. గద్దర్‌పై దాడి జరిగినప్పుడు హౌం మినిస్టర్‌ దేవేందర్‌ గౌడ్‌. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణా ప్రజా ఫ్రంట్‌ను స్థాపించాడు.

గుండెపోటు కారణంగా 2023 జూలై 20న హైదరాబాద్‌, అమీర్‌పేట్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన గద్దర్‌కు ఆగస్టు 3న వైద్యులు బైపాస్‌ సర్జరీ చేశారు. తరువాత ఆసుపత్రిలోనే చికిత్స పొందిన గద్దర్‌ ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలతో 2023, ఆగస్టు 6న మధ్యాహ్నం 3 గంటలకు మరణించాడు. గద్దర్‌ మతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతోపాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆగస్టు 6 సాయంత్రం నుండి ఆగస్టు 7 మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం గద్దర్‌ భౌతికకాయాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచబడింది. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, కవులు, కళాకారులు, వేలాదిగా అభిమానులు గద్దర్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఎల్బీ స్టేడియం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర గన్‌పార్కు నుంచి బషీర్‌బాగ్‌, లిబర్టీ, జేబీఎస్‌ మీదుగా 6 గంటలపాటు 17 కిలోమీటర్ల దూరమున్న అల్వాల్‌లోని గద్దర్‌ నివాసం వరకు కొనసాగింది. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు గద్దర్‌ భౌతికకాయానికి నివాళ్ళు అర్పించారు. గద్దర్‌ స్థాపించిన మహాబోధి పాఠశాల ఆవరణలో అధికార లాంఛనాలతో గద్దర్‌ అంత్యక్రియలు జరిగాయి.

- బి.గంగాధర్‌
ఎడిటర్‌ & పబ్లిషర్‌,
దళితశక్తి తెలుగు మాసపత్రిక

Wednesday, August 2, 2023

ఆగష్టు 15 & జనవరి 26 తేడా ఏమిటో తెలుసా?

ఆగష్టు 15 & జనవరి 26 తేడా ఏమిటో తెలుసా? 


ఆగస్టు 15, 1947న స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపు కుంటున్నాం. దేశ వ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలు లోకి వచ్చిన రోజు. ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపు కుంటాం. దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించు కుంటాం. అయితే ఆగస్టు 15న జెండా ఎగర వేయడానికి, జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. ఆ ముఖ్యమైన తేడా ఏమిటో తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగుర వేస్తారు. ఆగస్ట్‌ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్‌ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు.

మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్‌ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియ జేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు. ఈ రెండు తేదీలలో జెండాను రెపరెప లాడిస్తారు. ఇక్కడ జనవరి 26 నాడు జెండాను అప్పటికే కర్ర/పోల్‌కి పైన కట్టి ఉంచుతాము. కనుక ఆగస్ట్‌ 15లాగా జెండాను కింది నుండి పైకి లాగడం అనేది జరగదని గమనించాలి.

దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవం రోజున జెండా ఎగుర వేయడానికి గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒకకారణం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్‌ డే నాడు మహౌన్నత జెండాను ఆవిష్కరిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన వ్యత్యాసం ఏమిటంటే.. స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్ట్‌ 15 సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగుర వేస్తారు (ఖీశ్రీaస్త్ర నశీఱర్‌ఱఅస్త్ర). గణతంత్ర దినోత్సవంనాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు (ఖీశ్రీaస్త్ర ఖఅటబతీశ్రీఱఅస్త్ర). ఇంకొక వ్యత్యాసం ఏమిటంటే... స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి. రెండింటిలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఫోటో పెట్టాలి. స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్ట్‌ 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది. గణతంత్ర దినోత్సవం జనవరి 26న రాజ్‌పథ్‌లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగు తుంది. ప్రతి సంవత్సరం జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ చిత్రపటాన్ని ఖచ్చితంగా జెండా వద్ద పెట్టాలి. ఈ విషయం ఇప్పటికీ చాలా మంది ఈ దేశ పౌరులకు తెలియదు. (చదువు కున్న వాళ్లకు కూడా చాలా వరకు తెలియదు). కావున ఈ సమాచారాన్ని దేశపౌరులకు అందించాలని, మన వాళ్లకి అవగాహాన కల్పించడంకోసం అందించడం జరిగింది. ముఖ్యంగా భావిభారత పౌరులైన విద్యార్థులకు అందించాల్సిన అవసరంఎంతైన ఉంది. 

- బి స్వాతి, మేనేజర్‌

పచ్చని మణిపూరన కొండల్లో...

పచ్చని మణిపూరన కొండల్లో...

ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఎందుకు?



మణిపూర్‌ చిన్న రాష్ట్రమైన 33 తెగలు 190 భాషలకు నిలయం. ఆకుపచ్చని అరణ్యాలు, ఎత్తయిన కొండలతో నిండిన సుందరమైన మణిపూర్‌ కుకీ, మైతేయి తెగల ఘర్షణలతో మూడు నెలలుగా మండుతోంది. ఈ మంటలు రగిలిస్తున్నది ఎవరు? చలి కాగుతున్నది ఎవరు? లాభం పొందాలని ప్రయత్నిస్తున్న శక్తులు ఏవి అనేది ఆలోచించాలి.

మణిపూర్‌ రాష్ట్రంలో అత్యధికులు మైతీయి తెగకు చెందిన వారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని చాలా కాలం పాలించిన రాజవంశం కూడా ఈ తెగవారే. వీరి తరువాత రాష్ట్రంలో సింహభాగం గిరిజనులు. వారిలో ప్రధానమైన తెగలు కుకీలు, నాగాలు. సహజంగా గిరిజనులలో ఉండే అమాయకత్వం, మొండితనం, ధైర్యంతో కూడిన తెగువ వీరిలో నరనరాన జీర్ణించుకు పోయింది. ఆ సహజ స్వభావమే ఒకనాడు బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడేలా చేసింది. దేశంలో సాగిన తొలి గిరిజన పోరాటాలలో ఒకటిగా ఈ కుకీ తిరుగుబాటు ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ ప్రాచీన కాలం నుంచి ఉన్న కుకీలు, నాగాలు, ఇతర తెగలు ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ కొండ ప్రాంతాలలో నివసిస్తున్నారు. మొదటి నుంచి వీరందరూ సామాజికంగా ఎస్టీ హౌదాలో గుర్తించబడి కొనసాగు తున్నారు. అందువల్ల వీరు నివసించే అటవీ ప్రాంతాలలో వీరికి ప్రత్యేకంగా విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లతోపాటు అక్కడి భూములపై ప్రత్యేక ఆదివాసీ హక్కుల చట్టాలను అమలు పరుస్తున్నారు. అయితే, వీరి కంటే సామాజికంగా ఉన్నత హౌదాను అనుభవిస్తున్న మెయితీలు ఈ ప్రాంతాలకు వలస వచ్చారు.

వివాదానికి అసలు కారణం...
నిజానికి వీరు అధికంగా మైదాన, లోయ ప్రాంతాల లో నివసిస్తువస్తున్నారు. వీరిని సామాజికంగా బీసీ, ఓబీసీలుగా ప్రభుత్వాలు గుర్తించాయి. అయితే కాలక్రమంలో వీళ్ళు తమను కూడా గిరిజనులుగా గుర్తించి విద్య, ఉద్యోగ అవకాశాల తోపాటు, గిరిజనులు నివసించే కొండ ప్రాంతాలలోని భూములపై కూడా సమాన హక్కులు కల్పించాలని పోరాటా లను చేస్తూ వచ్చారు. రాష్ట్ర జనాభాలో కుకీలు, నాగాల చేతిలో 90% భూమి ఉండని, 53% జనాభా ఉన్న తమ వద్ద 10% భూమి మాత్రమే ఉందని మైతీయులు ఎదురుదాడికి దిగారు. (మణిపూర్‌లో కొండ ప్రాంతం 90% ఉంటే, మైదాన ప్రాంతం 10% మాత్రమే ఉంది) ఇది నిజమైనప్పటికీ భూమిపై హక్కు కోసం ఆర్థికంగా మెరుగ్గా ఉన్న మైతీలకు ఎస్టీ హౌదా ఇవ్వాల్సిన అవసరం లేదన్నది కుకీల వాదన. ఈ విషయంలో వారు ఎప్పటినుంచో తమ డిమాండ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లను విన్నవిస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి దష్టికి సైతం తీసుకువెళ్లారు. అయితే, మే 3వ తేదీన కుకీలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శ నలు నిర్వహించారు. ఇతర ప్రాంతాల్లో శాంతియుతం గానే సాగిన నిరసన చురా చాంద్బూర్‌ అనే కుకీల ఆధిపత్యం కలిగిన ప్రాంతంలో మాత్రం హింసకు దారి తీసింది. మైదాన, కొండ ప్రాంతం కలిసి ఉన్న చురా చాంద్పూర్‌లో మైతీయులు, కుకీలు ఎక్కువ ఉండటం వల్లే ఘర్షణలు తలెత్తాయి. హత్యలు కూడా జరిగాయి.

గత ఎన్నికలలో వీరికి మద్దతు పలికిన బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో వారి ఉద్యమానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. ఒకవైపు ఉద్యమం చేస్తూనే మరోవైపు మైతీయులు మణిపూర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 20న మణిపూర్‌ హైకోర్టు మైతీయులను కూడా కుకీలలాగే ఎస్టీ జాబితాలో కలపాలని తీర్పు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించింది. మైతీయు లను ఎస్టీ జాబితాలో చేర్చితే వారు తమపై ఆధిపత్యం చెలాయిస్తూ తమ సంస్కతి, సంప్రదాయాలను నాశనం చేస్తారని, తాము నివసించే అటవీ భూములను తమకు దక్కకుండా చేస్తారని భావించి రాష్ట్రంలోని అన్ని ట్రైబల్‌ గ్రూప్స్‌ కలిసి ఆల్‌ ట్రైబల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ ఆఫ్‌ మణిపూర్‌గా ఏర్పడి సంఘీభావ యాత్రను నిర్వహించాయి. ఆ తరువాత మే నెల నుంచి హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా గిరిజనులు తీవ్ర నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాలు చేపట్ట సాగారు. ఇది గిట్టని మైతీయులు తమకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న గిరిజనులపై కోపం పెంచుకుని అమాయక కుకీలు, ఇతర గిరిజనులపై మారణకాండకు తెగబడుతూ వాళ్ల ఆడవాళ్ళపై చేసిన అహంకార, ఆధిపత్య, బలప్రదర్శనకు సంబంధించిన వీడియో ఒకటి 72 రోజుల తరువాత బయటికి రావడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దీనిలో మానవత్వం మంట గలిసేలా ఉన్న చర్యలను చూసి మనుషులైన ప్రతి వారు సిగ్గుతో తలదించుకునేలా చేసింది. అయితే గడిచిన మూడు నెలలలో బయటకు వచ్చింది ఈ ఒక్క సంఘటన మాత్రమే. కానీ ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన మారణ హౌమంలో 142 మంది చనిపోయినట్లుగా, సుమారు 60,000 మంది నిరాశ్రయులయ్యారని, 5,000 దహనకాండ ఘటనలు చోటు చేసుకున్నాయని, 5,995 కేసులు పెట్టి, 6,745 మందిని కస్టడీలోకి తీసుకున్నారని వివిధ మీడియా సంస్థలు చెబుతున్న అంచనా. దుండగులు ఏకంగా 35 పోలీస్‌ స్టేషన్లపై దాడులు జరిపి ఆయుధాలు ఎత్తుకెళ్లారు. వాటిని అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.

ఆరోజు ఏం జరిగింది...?
మణిపూర్‌లో మే 3వ తేదిన మెయితీ, కుకీ తెగల మధ్య ఘర్షణ మొదలైంది. తమ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారంటే ఓ ఫేక్‌ వీడియో మెయితీ వర్గానికి చెందిన ప్రజల్లో వైరల్‌ అయింది. దీంతో ఆగ్రహం చెందిన మైతీయులు ఇంఫాలకు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌ పోప్కి జిల్లాలో ఒక గ్రామానికి చెందిన 800-1000 మంది మే4వ తేదీన మరో గ్రామంపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. వారి నుంచి రక్షించు కునేందుకు ఓ కుటుంబానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి, 19 ఏళ్ల అతడి కుమారుడు, 21 ఏళ్ల కుమార్తె, మరో ఇద్దరు మహిళలు అడవిలోకి పారిపోతుండగా... వాళ్లను వందల మందితో కూడిన గుంపు అడ్డగించి దాడికి పాల్పడింది. 21 ఏళ్ల యువతిని వివస్త్రను చేస్తున్న అల్లరి మూకను అడ్డగించిన 19 ఏళ్ల ఆమె తమ్ముడిని, 50 ఏళ్ల తండ్రిని చంపేశారు. తర్వాత యువతితోపాటు మరో 42 ఏళ్ల మహిళ బట్టల ఊడదీసి, నగంగా ఊరేగిస్తూ, అసభకరంగా తాకుతూ, కొడుతూ పొల్లాల్లోకి లాక్కెళ్లారు. యువతిపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఇద్దరితోపాటు మాజీ సైనికుడి భార్యను కూడా నగంగా ఊరేగించడం దేశానికే అవమాన కరంగా నిలిచింది. కార్గిల్‌ యుద్ధంలో శత్రువు నుంచి దేశాన్ని రక్షించిన తాను ముష్కరుల నుంచి తన భార్యను కాపాడుకోలేక పోయానని ఆవేదన చెందారు.తమను రక్షించాలని పోలీసుల వద్దకెళ్తే, వారే తమను గుంపు వద్దకు తీసుకెళ్లి వదిలి పెట్టారని బాధిత యువతి ఆవేదన వ్యక్తంగా చేసింది. తమను నగంగా ఊరేగిస్తూ, కొడుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించింది. తమ గ్రామంపై దాడి చేస్తున్న గుంపుతో కూడా పోలీసులు ఉన్నారని పేర్కొన్నది. తమను ఇంటి నుంచి ఫికప్‌ చేసిన పోలీసులు ఊరికి కొంచెం దూరంగా తీసుకుళ్లి గుంపు వద్ద రోడ్డుపై వదిలేశారని తెలిపింది. గుంపులో చాలా మంది ఉన్నారని, 21ఏళ్ల బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొన్నది.

రహదారుల విస్తరణ ఓ కారణమా?
రాష్ట్రంలోని ఏడు రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో సాగు దిగుబడులకు మార్కెట్‌ లభించ డంతోపాటు భూముల ధరలకు కూడా రెక్కలు వస్తున్నాయి. మైదాన ప్రాంతాల్లో ఉంటున్న మైతీయులకు అటవీ ప్రాంత భూములపై హక్కులు దక్కాలంటే వారికి ఎస్టీ హౌదా అత్యవసరంగా మారింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌ సహా మైదాన ప్రాంతాల్లో ఉన్న మైతీయులు ఇప్పటికే ఆర్థికంగా కాస్త మెరుగ్గా ఉన్నారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ముందంజలో ఉన్న మైతీయులు రహదారుల విస్తరణను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. అసెంబ్లీలోనూ మైతీయి ఎమ్మెల్యేల మెజారిటీ ఎక్కువగా ఉండటంతో ఎస్టీ హౌదా విషయంలో తమకు అన్యాయం జరిగిందని కుకీలు మండిపడుతున్నారు.

మంటపెట్టిన పౌరసత్వ చట్టం
రాష్ట్రంలో నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (పౌరసత్వ చట్టం-ఎన్నార్సీ)ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం కూడా కుకీలకు ఆగ్రహం తెప్పించింది. ఫొటో రికగెజేషన్‌ వంటి పద్ధతులను అమలు చేయడంతో వారిలో అనుమానాలను మరింత కలిగించింది. ఈ క్రమంలోనే ఎస్టీ హౌదాపై కోర్టు తీర్పు రాకముందే ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ హాజరు కానున్న ఓ కార్యక్రమ వేదికను కుకీలు తగులబెట్టారు. అయితే, మయన్మార్‌ నుంచి అక్రమ వలసను కట్టడి చేసేందుకే ఎన్నార్సీని అమలు చేస్తున్నా మని ప్రభుత్వం చెప్తున్నది. అయితే, తమను అక్రమ వలసదారులుగా ముద్రవేస్తూ ఇక్కడి భూములపై హక్కును కాలరాస్తోందని కుకీలు ఎదురుదాడికి దిగుతున్నారు. తమ ప్రధాన జీవ నాధారమైన గసగసాల సాగుపై ప్రభుత్వం ఆక్షలు విధించడం కూడా కోపం తెప్పించింది.

స్వయంపాలన కోరుతున్న కుకీలు
భారత రాజ్యాంగంలోని ఆర్థికల్‌ 244 ప్రకారం తమను 6వ షెడ్యూల్‌లో చేర్చాలని కుకీలు డిమాండ్‌ చేస్తున్నారు. 6వ షెడ్యూల్‌లో చేరితే గిరిజన, కొండ ప్రాంతాలకు స్వయం పాలన లభిస్తుంది. ఆ ప్రాంతాల్లో అటానమస్‌ డిస్టీక్ట్‌ కౌన్సిల్‌ (ఏడీసీ)ని ఏర్పాటు చేస్తారు. తమ ప్రాంతానికి సంబధించిన ఆదాయ వనరులు, నిర్ణయాలు, ఖర్చులన్నీ కౌన్సిల్‌ స్వయంగా చేసుకుంటుంది. గిరిజనుల కేసుల విచారణను వినేందుకు గ్రామ న్యాయస్థానాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఫలితంగా ఈ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారం పరిమితం అవుతుంది. ప్రస్తుతం అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాల్లోని 10 గిరిజన ప్రాంతాలను 6వ షెడ్యూల్‌ ప్రకారం స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లాలుగా గుర్తించారు. పాలకుల స్వప్రయోజనాల కోసమే మణిపూర్‌లో ఈ చట్టాలను అమలు చేయడం లేదని కుకీలు మండిపడుతున్నారు.

మణిపూర్‌ వాసులు పోరాటయోధులు
మణిపూర్‌ వాసులు పోరాట యోధులు, ప్రజాస్వామ్యం కోసం 1917 నుంచి 1937 మధ్య కాలంలో ఉద్యమించారు. దేశానికి స్వాతంత్య్రం లభించినప్పుడు బర్మాను కాదని ఇండియాలో కలిసేందుకే మొగ్గు చూపారు. విలీనంపై మణిపూర్‌ మహారాజు బుద్ధ చంద్ర 1947 ఆగస్టు 11వ తేదీన భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 1949 సెప్టెంబర్‌ 21వ తేదీన విలీన ఒప్పందంపై మహారాజు సంతకం చేశాడు. ఈ విలీనాన్ని వ్యతిరేకించిన వర్గాలు నాటి నుంచి సాయుధ పోరాటం చేస్తూనే ఉన్నాయి. 1964లో ఏర్పడిన యునైటెడ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ భారత్‌ '' నుంచి స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తున్నది. తర్వాత వివిధ లక్ష్యాలతో చాలా తిరుగుబాటు వర్గాలు ఉనికిలోకి వచ్చాయి. 1977లో కంగ్రీపాక్‌ పీపుల్స్‌ లిబరేషన్‌ పార్టీ, 1978లో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఏర్పాటయ్యాయి. 1980 నుంచి 2004 వరకు మణిపూర్‌ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారు. 1980 నుంచి సైన్యం అరాచకాలతో రాష్ట్రంలో మానవ హక్కులు మంటగలిశాయని ప్రజలు ఆందోళన చేపట్టారు. తంగ్‌ జామ్‌ మనోరమా దేవి అనే మణిపూర్‌ మహిళను అస్సాం రైఫిల్స్‌కు చెందిన జవాన్లు మానభంగం చేయడంతో అశాంతి పెల్లుబుకింది. మీరా పైబీస్‌ అనే మహిళా సంఘం నాయకత్వంలో మహిళలు ఏకంగా నగంగా మారి సైనికుల ముందు ప్రదర్శన నిర్వహించారు.

మహిళలే ఎందుకు టార్గెట్‌?
ఆదివాసీ తెగల్లో ఒక కుటుంబాన్ని అత్యంత దారుణంగా అవమానించడానికి మహిళలను చెరపట్టడాన్ని ఆయుధంగా ఉప యోగించుకుంటున్నారు. ఫలితంగా ఆ కుటుంబం తెగ సమాజంలో తలెత్తుకు తిరగదని వారి నమ్మకం. అయితే మణిపూర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలపై నిరసన తెలిపేందుకు మహిళలు నగత్వాన్ని నిరసనగా ఎంచుకున్నారు. ఆఫ్సా చట్టాన్ని రద్దుతోపాటు మరికొన్ని ఘటనల్లోనూ ఈ విధంగానే నిరసన తెలిపారు.

నల్లమందు సాగు...
కొండిపాంతంలో నివసించే కొంతమంది కుకీలు ఉపాధి కోసం మయన్మార్‌ డ్రగ్‌ లార్డ్స్‌ కోసం నల్లమందు. (ఓపియం) సాగు చేస్తున్నారు. మయన్మార్‌లో సార వంతమైన మణిపూర్‌లో పండించే ఓపియంకు విదేశాల్లో గిరాకీ ఉండటంతో వీరిని ప్రోత్సహి స్తున్నారు. నల్లమందు సాగులో కేవలం కుకీలే కాకుండా నాగాలు, మైతీయులు కూడా తమతమ పరిధిలో సాగు చేస్తున్నారు. ఈ సాగుకు అవసరమైన పనులు చేసేందుకు మయన్మార్‌, మిజోరం నుంచి కుకీలు ఇక్కడి వలస వస్తున్నారు. ఈ క్రమంలో 2017 నుంచికొండ ప్రాంతాల్లో వరుస దాడులు చేస్తూ ఓపీఎం, హెరాయిన్‌ పండిస్తున్న కుకీల పంట పొలాలను ప్రభుత్వ అధికారులు ధ్వంసం చేస్తున్నారు. దీంతో తమ ఆదాయాన్ని ప్రభుత్వం కొల్లగొడుతున్నదని అసహనంతో కుకీలు ఉన్నారు. ఉపాధి ప్రత్యామ్నాయాలు చూపకుండా తమను సంఘ విద్రోహులుగా ముద్ర వేస్తున్నా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కుకీలు ఏమంటున్నారు...?
కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న కుకీలు, నాగాలు దశాబ్దాలుగా అభివద్ధికి దూరంగా ఉన్నారు. అధికరణ 371సీ అక్కడి భూమిని ఇతరులు ఆక్రమించు కోకుండారక్షణ కల్పిస్తున్నది. అయితే... కొండ ప్రాంతాల్లో చట్టబద్దంగా నివసిస్తున్న తమను ప్రభుత్వం ఖాళీ చేయిస్తున్నదని కుకీలు ఆరోపిస్తున్నారు. తమ ఆధీనంలో ఉన్న అటవీ భూములను ఫారెస్ట్‌గా, తమ గ్రామాలను అక్రమ మైనవిగా ప్రకటిస్తూ తమకు నీడ లేకుండా చేస్తోందని అందోళన చెందుతున్నారు. తమ ప్రధాన ఆదాయ వనరు అయిన వ్యవసాయం చేయకుండా తరిమేస్తే బతికేదెట్లా...? అని ప్రశ్నిస్తున్నారు.
నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకుతినడం బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించడం తప్ప ఏముంది! ఇందు కోసమే మతాల మంటలను, కులాల కుంపట్లను రాజేసి ఓట్లుగా మలుచుకుంటున్న ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నన్ని రోజులు రణరంగం కానిచోటు భూ స్థలమంతా వెదికినా దొరకదు. శాంతి భద్రతల విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలు, పార్టీలు ఈ విషయాన్ని ఒక పొలిటికల్‌ మైలేజీగా చూస్తున్నాయి. మణిపూర్‌ మంటలు చల్లారాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించాలి. ఈ చట్టంలో కొన్ని మార్పులు చేసి తిరిగి అమలు చేయాలి. ముఖ్యంగా జాతుల వైరాన్ని నివారించడం కోసం మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలి.
- బి గంగాధర్‌, ఎడిటర్‌

అన్నింటా... మహిళకే అవరోధం?

అన్నింటా... మహిళకే అవరోధం?

స్వాతంత్య్ర వచ్చి 76 సంవత్సరాలు గడిచిన దేశ జనాభా సగభాగంగా వున్న మహిళలను నేటికి పురుషులతో సమానంగా చూడలేకపోతున్నారు. భారతదేశం పారిశ్రమిక రంగంతోపాటు శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటి పడుతున్నది. అయినా దేశంలో అన్ని ప్రాంతాలను, వివిధ వర్గాల ప్రజలను ముఖ్యంగా మహిళలను సమానంగా చూడలేకపోతున్నది. దీనికి కారణం పాలకులా? ప్రభుత్వ యంత్రాంగమా? మనది పితృస్వామ్య సమాజం, అందుకే పురుషులకు అన్ని విధాల పరిస్థితులు అనుకూలంగా తయారు చేయబడ్డాయని చెబుతారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు మహిళలు అనేక రంగాల్లో తమ సత్తా చాటుకుంటునే ఉన్నారు. అయినా వారిని బలహీనులుగా చూస్తున్నారు. పురుషుడు చేస్తున్న అన్ని పనులను సైతం మహిళలు సునయాసంగా చేస్తున్న పరిస్థితిని గమనిస్తున్నాం, పాలకులకు మాత్రం వారి సేవలు కనిపించడం లేదు. విద్యా, ఉద్యోగం, ఉపాధి రంగాల తోపాటు రాజకీయంగా దేశ ప్రథమ పౌరురాలు నుండి కింది స్థాయిలో పనిచేసే వరకు అన్ని రంగాల్లో, మహిళలు ఉన్న వివక్ష మాత్రం తప్పడం లేదు. సామాజిక, సేవ రంగాల్లో మహిళల కృషి దేశం ఎన్నటి మార్చిపోలేదు. పారిశ్రామికం గా అనేక మంది మహిళలు రాణిస్తున్నారు. రాజకీయ రంగంలో అవకాశం దొరికిన ప్రతిసారి తనను తాను నిరూపించుకుంటున్నది. కానీ అవకాశాలే లేకుండా చేస్తున్న రంగం ఎదైనా ఉందంటే రాజకీయ రంగం మాత్రమే. అన్నింటికీ మహిళనే హస్త్రంగా ఉపయోగిస్తున్నారు. మణిఫూర్‌లో మహిళలను ఊరేగించడం అయా సామాజిక వర్గం ప్రజలను బయటికీ రాకుండా, భయపెట్టడానికే చేశారని బహిరంగంగానే ప్రకటించారు.

సంక్షేమ పథకాలు అంటే నిరుపేదలైన వారికి అందించేందుకు రాజ్యాంగం ప్రత్యేక ఆధికరణలను ఏర్పాటు చేసంది. ఎస్సీ, ఎస్టీలు, బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉండేందుకు కాకుండా అన్ని వర్గాల ప్రజలకు అందించేందుకు రాజకీయ పార్టీలు పెద్దఎత్తున్న సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి. దీంతో పేద ప్రజల పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది కనుక వారిలో అసంతప్తి ప్రబలితే తమకు మొదటికే మోసం వస్తుందేమోనని ఉపశమన పరిచేందుకు తెచ్చినవే సరికొత్త సంక్షేమ పధకాలు. అధికారం కోసం ఒక పార్టీ కంటే మరొక పార్టీ ఎక్కువ ఇస్తానని చెప్పి ఓట్లను కొల్లగొట్టడం తప్ప సంక్షేమ పధకాలను ఎత్తివేసే పరిస్థితి లేదు, అలాగే పూర్తిస్థాయి వాటిని అమలు చేసిన దాఖాలాలు లేవని చెప్పాలి.
స్వయం నిర్ణయాధికారం కల్పించేందుకు విద్యా, ఉద్యోగం, ఉపాధి అందించేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రాకుండా సంక్షేమ పథకాలతోనే ప్రజలను భ్రమలో ముంచుతున్నారు. కులం, మతం, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి అధికారంలోకి వస్తున్నాయి. తాము ఎవరిని ఎన్నుకోవాలనే నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛనుండి పక్కకు తప్పుకునేట్లు చేస్తున్నాయి. అప్రమత్తంగా లేకపోతే నష్టపోయేది అంతిమంగా ప్రజలే.
- బి గంగాధర్‌, ఎడిటర్‌

Friday, July 21, 2023

...దేశం రావణకాష్టంలా


 ...దేశం రావణకాష్టంలా 


వట్టిగా

ఆడిపోసుకుంటాం కానీ..


నీరో చక్రవర్తి 

మరీ 

అంత దుర్మార్గుడేం కాదు 


రోమ్ నగరం తగలబడుతుంటే 

నీరో చక్రవర్తి 

ఫిడేలు వాయిస్తూ 

సంగీత సాధన చేస్తున్నాడు 


అంతేగాని 


రోమ్ నగరం తగలబడాలని కోరుకోలేదు 


తగలబెట్టనూ లేదు

ఆ... అగ్నికి 

ఆజ్యమూ పోయలేదు 


చక్రవర్తి నీరో పై 

కేవలం 

బాధ్యతల్ని విస్మరించడన్నదే ఆరోపణ 


కానీ 

ఇవ్వాలా.. ఇక్కడ 


కుల.. మత.. జాతి వైషమ్యాలతో 


దేశం   

దేశమే తగలబడుతుంటే 


ఈ 

విద్వేషాగ్నులకు 

సమిధలు వేస్తూ 

ఆ అగ్నికీలలకు 

ఆజ్యం పోస్తూ... 


అప్పుడప్పుడు 

తడి లేని 

రెండు పొడి మాటల్ని విదిలిస్తూ... 


రక్తపు మరకల 

రాక్షస హస్తాలతో రాజ్యాధికారాన్ని 

పదిల పరుచుకుంటూ 


ఓ  నా దేశ పాలకుల్లారా ! చూద్దాం 


మీరు 

ఇంకెంతకాలం వర్ధిల్లుతారో 


కాలానికి 

ఎదురెదుకుంటూ....


...బత్తుల శ్రీనివాసులు

తియ్యని మాటలతో... మభ్యపెట్టడం ఎన్ని ఏళ్ళు


తియ్యని మాటలతో... మభ్యపెట్టడం ఎన్ని ఏళ్ళు 

అంతటి అమానుష ఘటన మీద ప్రధానమంత్రి స్పందన ఎలా ఉండాలి? డెబ్బైఏడు రోజులుగా మణిపూర్‌ ఘోరకలిమీద ప్రధాని నోరువిప్పలేదు. రక్షించడం లేదు, రాష్ట్రంలో పర్యటించడమూ లేదు, కనీసం మాట్లాడండి అని ఆ రాష్ట్రప్రజలే కాదు, మిగతా దేశమూ ఆయనను ప్రార్థిస్తోంది. ఎట్టకేలకు ఆయన మాట్లాడారు. అదీ, సామాజిక మాధ్యమాల్లో ఒక దారుణఘటనకు సంబంధించిన విడియో వెలుగుచూసి, దేశం యావత్తూ దిగ్భ్రాంతి చెందిన తరువాత. మణిపూర్‌ మీద ప్రధాని సమక్షంలో చర్చ జరగాలని, ఆయన రావాల్సిందేనని లోపల విపక్షాలు పట్టుబడుతూంటే, ఎన్నడూ మీడియాతో మాట్లాడని నరేంద్రమోదీ, పార్లమెంటు వెలుపల నాలుగుముక్కలు మాట్లాడారు. ఆ మాటలు విన్నవారికి అవి తడిసిన మనసులోనుంచి వచ్చినవని అనిపిస్తాయా? హింస నివారణలో ఆయన జోక్యాన్ని కోరుతున్నవారు, పాశవికదాడులు ఎదుర్కొన్న బాధితులు, ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయిన దేశప్రజలకు ఈ మాటలు ఉపశమనాన్ని, నమ్మకాన్ని ఇస్తాయా?


మణిపూర్‌లో పరిస్థితులు ఎంతటి భయానకంగా ఉన్నాయో ఈ విడియో తెలియచెబుతోంది. కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించడం, అత్యాచారం చేయడం, అడ్డుకోబోయిన కుటుంబీకులను హింసించి చంపేయడం మీతీల ఉన్మాదం ఏ స్థాయిలో సాగుతోందో అర్థమవుతుంది. ఈ ఆదివాసీయువతులు ప్రాణరక్షణకోసం పారిపోతూ, రక్షకభటుల చేతికి చిక్కితే, వారే తిరిగి వీరిని మీతీ సేనలకు అప్పగించారంటే పాలకులు, అధికార యంత్రాంగం కలగలసి చేపట్టిన జాతినిర్మూలన అని అర్థం. అందుకే, మిగతాదేశం ఈ విడియో చూసి, దిగ్భ్రాంతికి, విషాదానికి లోనైంది కానీ, మీతీ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ చలించిపోలేదు, కదిలిపోలేదు. ఇటువంటివి వందలకొద్దీ ఉన్నాయన్న ఒక్కమాట చాలు అక్కడ జరుగుతున్నదేమిటో మనకు అర్థంకావడానికి. తక్షణశిక్షలు అమలుచేసే డబుల్‌ ఇంజన్‌ పాలకులు విడియోలో మొఖాలు చూసి బుల్‌డోజర్లతో ఇళ్ళూవాకిళ్ళూ కూల్చివేయగల సమర్థులు. కానీ, మణిపూర్‌లో ఈ ఘాతుకానికి పాల్పడిన దుర్మార్గులు వారికి ఆ మహిళలను స్వయంగా అప్పగించిన పోలీసులకు కానీ, అనంతరం ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసిన అధికారులకు కానీ, గుర్తుతెలియనివ్యక్తులుగానే ఉండటం విచిత్రం. రెండు దశాబ్దాల క్రితం గుజరాత్‌లో జరిగింది, ఇప్పుడు మణిపూర్‌లో జరుగుతున్నదీ ఒక్కటే. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందన్నది ఒట్టిమాట, ఓ మర్యాదమాట. అక్కడ జరుగుతున్నది మతపరమైన ఊచకోత. అక్రమ వలసదారుల పేరిట, గంజాయి సాగుదారులపేరిట మణిపూర్‌ కొండలనుంచి చిట్టచివరి ఆదివాసీని తరిమికొట్టేవరకూ సాగే జాతిహననం. గుజరాత్‌లో మాదిరిగా పాలకుల ఆశీస్సులతో సమస్త వ్యవస్థలూ కట్టగట్టుకొని సాగిస్తున్న మారణకాండ. ఆదివాసీ భూములను హస్తగతం చేసుకోవడానికి చట్టాలు అడ్డుపడుతున్నప్పుడు, అంతర్యుద్ధం ఒక్కటే మార్గం. యాభైవేలమంది కేంద్రబలగాలున్నా, కేంద్రమే నేరుగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నా పరిస్థితుల్లో మార్పురాలేదంటే, ఇది ఆవేశకావేశాలతో ఆకస్మికంగా రేగిన అగ్గికాదని, ప్రణాళికాబద్ధంగా సాగుతున్న కార్చిచ్చని అర్థమవుతుంది. ఇంతకాలమూ లోపల జరుగుతున్నదేమిటో బయటికి తెలియకుండా పాలకులు ఎంతో జాగ్రత్తపడ్డారు. నాయకులనే కాదు, పరిశీలకులను కూడా రానివ్వకుండా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. సుప్రీంకోర్టు వరకూ పోయి డెబ్బయ్‌ఏడురోజులుగా ఇంటర్నెట్‌ ఇవ్వకుండా జాగ్రత్తపడ్డారు. అయినా, దాచాలనుకున్నందంతా ఈ విడియోతో బయటకు పొక్కింది. ఇంతవరకూ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోని సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు చేసింది. పాలకులు మాత్రం విడియోను తొలగించాల్సిందిగా సామాజిక మాధ్యమ సంస్థలను ఆదేశించారు. 


మణిపూర్‌లో బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన విధించాలని విపక్షాలు మళ్ళీ డిమాండ్‌ చేశాయి కానీ, మోదీ మాటలు విన్న తరువాత కూడా అటువంటిదేదో జరుగుతుందని ఎవరికీ నమ్మకం అక్కరలేదు. ఇంతకాలం తరువాత తప్పనిసరిగా స్పందించాల్సి వచ్చినందున కాబోలు అద్భుతమైన ఆ మాటకారి నోటినుంచి వచ్చిన ఆ నాలుగు మాటల్లో తడిలేదు. పైగా యావత్‌ సమాజమూ తలదించుకోవాలంటున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ అమ్మలనూ, అక్కలనూ కాపాడాలంటున్నారు. స్వపక్షపాలిత రాష్ట్రంలో ఈ ఘోరం జరిగితే, కాంగ్రెస్‌ పాలిత రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌లను కూడా ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించారు. అందుకే, ఎంతోకాలం తరువాత స్పందించినా, అది ఈ దేశ ప్రధానిగా కాక, ఒక బీజేపీ నాయకుడు మాట్లాడినట్టే అనిపించింది.

Sunday, July 9, 2023

ఉమ్మడి పౌర స్మృతి మీద ఒక విశ్లేషణ

 ఉమ్మడి పౌర స్మృతి మీద ఒక విశ్లేషణ

ఈ దేశంలో ముస్లింలకు అన్ని విషయాల్లో ప్రత్యేక చట్టాలు ఏమి లేవు. క్రిమినల్ లాస్, సివిల్ లాస్ అందరికీ సమానం. ముస్లిం కి అన్ని విషయాల్లో సెపరేట్ లా ఉంది అనడం దుష్ప్రచారం మాత్రమే. వాళ్ళు అందరిలా ఇక్కడి అన్ని చట్టాలని ఫాలో అవుతున్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కుల ప్రకారం అన్ని మతాలకు మత స్వేచ్ఛ ఉంది. దాని ప్రకారమే అన్ని ప్రధాన మతాలకు వారి వారి పర్సనల్ లాస్ ఉన్నాయి. దానిని రాజ్యాంగం ఆదిలోనే ఆమోదించింది.

ముస్లింలకు ఒక్కరికే పర్సనల్ లా ఏమీ ప్రత్యేకంగా లేదు. హిందువులకు హిందూ పర్సనల్ లా ఉంది, క్రిస్టియన్స్ కి క్రిస్టియన్ పర్సనల్ లా ఉంది. ఇలా అన్ని మతాలకు రాజ్యాంగం కల్పించిన పర్సనల్ లాస్ ప్రకారం కొన్ని విషయాల్లో మాత్రమే తమ మత ఆచారాల ప్రకారం కొన్ని వ్యవహారాలు చేసుకొనే మతస్వేచ్ఛ అన్ని వర్గాల వారికి ఉంది. ఆ ప్రకారం ప్రతి మతం లాగా, ముస్లింలు కూడా కేవలం పెళ్ళి, విడాకులు, దత్తత, ఆస్తి పంపకాలు లాంటి వ్రేళ్ళ మీద లెక్కబెట్టే కొన్ని పరిమితమైన వ్యక్తిగత మరియు కుటుంబ వ్యవహారాలను వారి మత ఆచారాల ప్రకారం అమలు చేసుకొనే స్వేచ్ఛ ఉంది. 

అది స్వాతంత్ర్యం నుండి అమలులో ఉంది. అది రాజ్యాంగబద్ధ హక్కు. ఏ మతానికైనా లేదా వ్యక్తికైనా పైన చెప్పిన వ్యవహారాల్లో అతని మతానికి చెందిన ఆచారాలను పాటించాలని లేకపోతే అతను కామన్ చట్టాల ప్రకారం ఆయా వ్యవహారాలను చేసుకోవచ్చు. దానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. కాబట్టి క్రొత్తగా ఏమి చట్టాలు చేయనక్కర లేదు. ఆల్రెడీ ఉన్నాయి. ఉదాహరణకు ఏ మతాన్ని అవలంభించని, దేవుడిని నమ్మని నాస్తికులు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా. మరి ఆ పెళ్లిళ్లు రిజిస్టర్ మ్యారేజ్ ద్వారా అవుతున్నాయి కదా. అంటే మతం వద్దు అన్న వారికి సయితం పెళ్లి, విడాకులు, దత్తత, ఆస్తి పంపకాలకు సంబంధించి ఇప్పటికే కామన్ చట్టాలు ఉన్నాయి. వాటి ప్రకారమే కోర్టులు తీర్పులు చెబుతున్నాయి. 

మరి క్రొత్తగా కామన్ సివిల్ కోడ్ ఏమిటి? ఇప్పుడు దాని అవసరం ఏమిటి?

సివిల్ లాస్ విషయంలో కొన్ని పరిమితమైన వ్యవహారాల్లో రాజ్యాంగం రెండు రకాల అవకాశం, ఏర్పాటు చేసింది. అదేమిటంటే మతస్వేచ్ఛకు అనుగుణంగా ఎవరైనా తమ మత ఆచారాల ప్రకారం తమ వ్యక్తిగత లేదా కౌటంబిక వ్యవహారాలను కొనసాగించుకోవచ్చు లేదా కామన్ చట్టాలను కూడా అతను ఫాలో అవ్వవచ్చు. మరి అటువంటప్పుడు బలవంతంగా అందరికి ఒకే చట్టం అని ఇప్ప్పుడు ఈ హడావిడి ఎందుకు? రాజ్యాంగ బద్ధంగా తమ మత ఆచారాలను ఫాలో అవుతాము అన్న వారి మత స్వేచ్ఛను ఎందుకు అధికారికంగా లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం కాదా?

భిన్నత్వంలో ఏకత్వమే మన దేశాన్ని 75 సంవత్సరాలు దాటేసినా కూడా ఒకే దేశంగా నిలబెట్ట గలిగింది కదా! మరి భిన్నత్వంలో ఏకత్వం వల్ల వల్ల కలిగిన లేదా కలుగుతున్న ప్రధాన నష్టం ఏమిటి? అన్ని మతాల పర్సనల్ లాస్ వల్ల దేశానికి జరుగుతున్న నష్టం ఏమిటి? రాజ్యాంగ బద్ధంగా ఎవరి మత ఆచారాలను వాళ్ళు ఫాలో అయితే ఈ ప్రభుత్వానికి వచ్చిన నొప్పేమిటి? రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రం ముసుగులో, రాజ్యాంగ ప్రాధమిక హక్కులైనటువంటి మత స్వేచ్ఛను కాలరాయడం న్యాయమా? అది ప్రజాస్వామ్యమా? 

ఇప్పుడు దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలు అయినటువంటి పేదరికం, నిరుద్యోగం, అవినీతి, పెరుగుతున్న నిత్యావసర ధరలు, మండుతున్న గ్యాస్, పెట్రోల్ ధరలు, నడ్డి విరుస్తున్న పన్నులు, ఆడవాళ్ల పై పెరిగిపోతున్న అఘాయిత్యాలు, దేశానికి తిరిగిరాని నల్లధనం, కూలుతున్న వంతెనలు, దిగజారిపోయిన జిడిపి, వెనక్కి వెళ్ళిపోతున్న విదేశీ పెట్టుబడులు, దివాళా తీస్తున్న కంపెనీలు, బ్యాంకులు, బడా బాబులు ఎగవేస్తున్న బ్యాంకు అప్పులు, రైతుల ఆత్మహత్యలు, నిర్వీర్యం చేయబడుతున్న ప్రభుత్వ సంస్థలు, అమ్ముడు అవుతున్న దేశ సంపద, ప్రయివటైజేషన్, ఇవన్నీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పర్సనల్ లాస్ వల్ల జరుగుతున్నాయా? అలా కాదే! 

మరి అందరినీ ఇబ్బంది పెడుతున్న  ప్రధాన సమస్యలను పరిష్కరించడం మానేసి, గత ఎన్నికల సమయంలో ప్రజలకు చేసిన దేశాభివృద్ధి వాగ్దానాలు పూర్తి చేయకుండా, వారి పరిపాలనా లోపాలను కప్పిపుచ్చు కోవడానికి, దేశంలో హిందూ ముస్లింలు ఎప్పుడూ విభజించబడి, పరస్పరం దూషించుకునే, ద్వేషించుకునే సున్నితమైన మతపరమైన అంశాలను తెరపైకి తీసుకురావడం, మెజారిటీ మతం యొక్క ఓట్లను పొందడం కోసం, మైనారిటీ వర్గాల హక్కులను కాలరాసే నల్ల చట్టాలను అమలు చేయడం అనేది ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తగునా? 

పాలించే ప్రభుత్వం దేశంలోని అన్ని మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు ప్రతినిధినా? లేదా ఒక ప్రధాన మతానికి మాత్రమే ప్రతినిధినా? రాజ్యాంగలోని ఆదేశిక సూత్రాలలో చేయమని చెప్పిన చాలా ప్రధాన విషయాలు ఉండగా, కేవలం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ను మాత్రమే, అది కూడా 2024 ఎన్నికల ముందు ఇంత హడావుడిగా అమలు చేసే ప్రయత్నం వెనుక దాగి ఉన్న మతరాజకీయం ఏమిటీ? ఒక వేళ యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం అని భావించినా కూడా, అసలు అది ఎలా ఉంటుందో ఓ స్పష్టమైన ముసాయిదా ఏది? అది క్లియర్ గా చెప్పకుండా మీరు యూసీసి ని సపోర్ట్ చేస్తారా లేదా అని అడగడం మోసం కాదా? ప్రజలను మతం పేర విభజించే మత రాజకీయం కాదా?

ఇది ఎలా ఉందంటే బస్టాండ్ లో ఎవరి ఊరి బస్సు వాళ్ళు ఎక్కడం కాదు, అందరూ ఒకే బస్ లో ప్రయాణం చేయాలి ఎందుకంటే పెట్రోల్ కలసి వస్తుంది అన్నట్లుంది! ప్రయాణికుడు స్వంత డబ్బులతో టిక్కెట్ కొని అతని ఊరి బస్ ఎక్కాక, నీవు చెప్పే కాకమ్మ కబుర్లు విని, నీ అబద్ధపు పెట్రోల్ సేవింగ్ కోసం విశాఖపట్నం, విజయవాడ లేదా ఇతర ప్రాంతాలకు, వేర్వేరు దిక్కులకు వెళ్లాల్సిన ప్రయాణినికులు, వారి వారి ఊరి బస్ ల నుండి దిగిపోయి, నీవు ఏర్పాటు చేసిన ఏ ఊరి బోర్డ్ లేని, ఏ రూటు వెళ్తుందో తెలియని బస్ లో  ప్రయాణికులు ఎలా ఎక్కుతారు? ఒకవేళ ఎక్కినా ఒకే బస్ అందరిని ఏకకాలంలో అనేక దిక్కుల్లో ఉన్న వారి వారి ఊర్లకు ఎలా చేర్చుతుంది? ఇది హాస్యాస్పదంగా లేదా?  కాబట్టి ముందు స్పష్టమైన యూసిసి ముసాయిదా తయారు కావాలి, దానిపై అన్ని మతాల వారితో సుదీర్ఘంగా చర్చించాలి. మెజారిటీ, మైనారిటీ తేడా లేకుండా ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవించాలి. ప్రతి ఒక్కరి హక్కులను, మతస్వేచ్ఛను కాపాడుతూ, రాజ్యాంగ ప్రాధమిక హక్కులకు భంగం వాటిల్లకుండా ఆ క్రొత్త చట్టాలు ఎలా ఉంటాయో అందరికీ తెలియపరచాలి. వాటిలో మార్పు చేర్పులతో, అందరి ఆమోదంతో మాత్రమే యూ.సి.సి. తయారవ్వాలి.

ఆ బాధ్యతను కూడా ఒక రాజకీయ పార్టీకి ఇవ్వరాదు. మతతత్వ పార్టీకి అస్సలు ఇవ్వరాదు. అది బీజేపీ అయినా, ఎమ్.ఐ.ఎమ్. అయినా సరే. ఈ అతి సున్నితమైన, యావత్ భారతదేశ ప్రజల పై, విభిన్న రాష్ట్రాల పై, అక్కడి మతాలపై, వర్గాలపై, ఆచారాలు, సంస్కృతులపై తీవ్ర ప్రభావం చూపే యూ.సి.సి. లాంటి చట్ట తయారీ బాధ్యత ఒక స్వచ్చంద సంస్థకు అప్పజెప్పాలి. నిపుణులతో కూడిన ఆ కమిటీలో అన్ని ప్రాంతాల, మతాల, వర్గాల వారికి సమాన ప్రాతినిధ్యం కల్పించాలి. వారు అందరూ సుదీర్ఘంగా చర్చించి నిజంగా సంస్కరణకు అవసరమైన విషయాలను పారదర్శకంగా చర్చించి, ఎవరి విశ్వాసాలను, మనోభావాలను, ఆచారాలను దెబ్బతీయకుండా కామన్ చట్టాలు తయారు చేయడంలో తప్పు లేదు. 

కానీ అసలు సమస్య ఏమిటంటే ఇంతటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం తన ఎజెండాలో పెట్టుకున్న ఓ మతతత్వ పార్టీ ఈ యూ.సి.సి. గురించి అడుగులు వేస్తుంటే సాధారణంగా మైనారిటీ వర్గాలు ఆందోళన చెందుతాయి. వారిని కాన్ఫిడెన్స్ లో తీసుకోవాల్సిన అవసరం గుర్తించకుండా, తమ పార్టీ సపోర్టర్స్ తో మీకు హిందూ దేశం కావాలంటే ఇదే మంచి సమయం, యూ.సి.సి. ద్వారానే దానిని సాధించుకోగలం, ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సాధ్యం కాదు, దేశంలో ముస్లింలు ఒక్కరే ప్రత్యేక స్వేచ్ఛను అనుభవిస్తున్నారు అని అబద్ధాలు చెబుతూ, దాని వల్ల హిందువులు ఎంతో కోల్పోతున్నారు అని నమ్మబలుకుతూ, ముస్లింలు దేశాన్ని ప్రేమించడం లేదు వారి మతానికే ప్రాధాన్యత ఇస్తున్నారు అని అసత్యాలు ప్రచారం చేస్తూ, ఓ ప్రక్క మాకు దేశమే ముఖ్యం మతం కాదు అని చెబుతూనే, మరో ప్రక్క అమాయక హిందూ సోదరులను మతం పేరుతో రెచ్చగొడుతూ, రాబోయే 2024 ఎన్నికల్లో మెజారిటీ మతం వారి ఓట్లతో మరోసారి అధికారం కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. 

అంతా డబల్ స్టాన్సర్డ్. ఏనుగుకి రెండు రకాల పళ్ళు ఉంటాయట. చూపించే పళ్ళు వేరే, తినే పళ్ళు వేరే. అలా ఉంది వీరి వరసా. ఆ మతతత్వ పార్టీ మాకు దేశం ప్రధానం, మతం కాదు అంటూనే, రాజ్యాంగం మరియు నేటి చట్టాలలోని అన్ని లొసుగులు వాడుకుంటూ, ఈ దేశాన్ని మత దేశంగా మార్చే ప్రయత్నంలో భాగమే నేటి ఈ యూ.సి.సి. అమలుకు కృషి చేస్తుందని రాజకీయ విశ్లేషకుల గట్టి అభిప్రాయం. కాబట్టి ఒకవేళ సున్నితమైన మతాన్ని వాడుకొని, అధికార దుర్వినియోగానికి పాల్పడి, బలవంతాన యూనిఫామ్ సివిల్ కోడ్ ను వారికి అనుకూలంగా తయారు చేసుకొని అమలు చేసినా సరే, ఈ దేశాన్ని ఆర్ధికంగా మరియు అన్ని విధాలా అధోగతికి నెట్టుతున్న సమస్యల్లో 0% కూడా ఏ మార్పు రాదు. ఇంకా సమస్యలు జఠిలమై, దేశంలో అస్థిరత ఏర్పడి, మానవ హక్కుల ఉల్లంఘన జరిగి, దేశం మరో శ్రీలంకలా ఆర్ధికంగా, అన్ని విధాలా దివాళా తీయడం మాత్రం ఖాయం.

అప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల ఏమాత్రం లాభం ఉండదు. కాబట్టి విజ్ఞత గల భారతీయులు ఎమోషనల్ అయి ఆ మతతత్వ పార్టీ ఉచ్చులో పడకుండా నిజాయితీగా, నిజమైన భారతీయులుగా ఆలోచిస్తేనే అసలు వాస్తవం అర్ధం అవుతుంది. ఆ మతతత్వ పార్టీ వారు "దేశాన్ని ప్రేమించే వారు యుసిసి కావాలంటుంటే, మాకు మా మతమే ముఖ్యం అంటున్న వారు మాత్రమే దీనిని వ్యతిరేకిస్తున్నారు" అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వీరి మెసేజ్ లతో, వీడియోలతో సోషల్ మీడియా వేదికలు నిండిపోతున్నాయి. ఇలా ఆ పార్టీ మతం పేరున అమాయక ప్రజల నుండి యూ.సి.సి. కి సపోర్ట్ ను కూడగడుతుంది. కానీ వాస్తవం ఏమిటంటే దేశాన్ని ప్రేమిస్తున్న వారందరూ యూ.సి.సి.ని వ్యతిరేకిస్తుంటే, కేవలం ఆ మతతత్వ పార్టీని గుడ్డిగా ఫాలో అవుతూ మాకు దేశం కన్నా మా మతతత్వ పార్టీనే ముఖ్యం, మా నాయకుడే ముఖ్యం అంటున్నవారు మాత్రమే అసలు ఏ జ్ఞానం లేకుండా యూ.సి.సి. ని సపోర్ట్ చేస్తున్నారు. ఇది యదార్ధం.

కానీ చివరకు ఒక మాట అంటాను: నిజంగా నిద్రపోయే వారిని నిద్ర లేపొచ్చు గాని, నిద్రపోతున్నట్లు నటించే వారిని మాత్రం నిద్ర లేపలేము. ఇక ఎవరి ఇష్టం వారిది. ఎవరు చేసుకున్న ఖర్మకు వారే బాధ్యులు.

   - గడ్డం అశోక్ వాల్ నుండి

Sunday, June 25, 2023

ప్రణాళికాలు లేని... దేశాభివృద్ధి

ప్రణాళికాలు లేని... దేశాభివృద్ధి

 

దేశంలో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పాలకపార్టీలు కృత్రిమంగా ఎన్నికల వాతావరాణాన్ని సృష్టిస్తున్నాయి. ప్రజలకు ఉన్న సమస్యలు పక్కా దారి పట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం దశాబ్ధి ఉత్సవాల పేరుతో ఇరవై రోజులపాటు కోట్లాది రూపాయాలు ఖర్చు పెట్టి ప్రభుత్వ కార్యక్రమాలను సైతం సొంత పార్టీ కార్యక్రమంగా మార్చుకున్నది. దశాబ్ధి ఉత్సవాలు ఆయావర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలు నేరవేర్చినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. నీళ్లు, నిధులు, నియమకాల పేరుతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం జరిగింది. లక్షల కోట్లు ఖర్చు చేసిన రైతులకు పూర్తిస్థాయిలో నీళ్లు అందించలేకపోతున్నది. రైతుల ఆరు నెలలు కష్టపడి పండించిన పంట కొనుగోలు చేయలేక, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్న రైస్‌ మిల్లర్ల దోపిడిని కట్టడి చేయలేక, రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసిన ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేసినట్లు ఉత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉంది.

నిధుల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ధనిక రాష్ట్రం పేరుతో ప్రజాప్రతినిధులు లక్షలాది రూపాలయాలను వేతనాలు అందుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల వేతనాలు చెల్లించడంలో విఫలం అవుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రతినెల రుణాలు తీసుకోకుంటే ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో కూడా నిధులు దుబారా ఖర్చు చేస్తున్న విషయం కాగ్‌ నివేదికలో పేర్కొనడం మనం గమనించాలి. వివిధ అభివృద్ధి పనులు చేసినబిల్లులు చెల్లించలేక సర్పంచ్‌ మొదలుకుని కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా ప్రభుత్వాల్లో చలనం కనిపించడం లేదు.
నియమాకాలు... ''ఊరందరిదీ ఓ దారైతే... ఉలిపి కట్టెది మరోదారి...'' అన్నట్టు ఉన్నది తెలుగు రాష్ట్రాల పరిస్థితి. కాంట్రాక్టు నియమాకాలు రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాటలు నీటిమీద రాతలు అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక ఖాళీలు ఉన్న, ఒక్క ఉద్యోగి రెండు, మూడు రకాల పనులు చేస్తున్నారు. ఇది మన పాలకులకు తెలియంది కాదు. కానీ అన్ని ఖాళీలు భర్తీ చేసినట్లు గ్లోబల్‌ ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. ప్రకటించిన నియమాకాలు సైతం భర్తీ చేయలేకపోతుంది. ప్రైవేటు పరిశ్రమల్లో కార్మికులు/ఉద్యోగులను ప్రభుత్వం భర్తీ చేసినట్లు తన ఖాతాలో వేసుకుంటుంది.
తన అధికారాన్ని ప్రశ్నిస్తున్న కవులు, కళాకారులను, మేధావులను, ప్రజా సంఘాల నాయకులను, ముఖ్యంగా జర్నలిస్టులను దేశద్రోహులుగా ముద్రవేస్తూ నల్లచట్టాల కింద అణచివేయాలని చూస్తుంది. ప్రశ్నించే వారిని లేకుండా చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. అవినీతి, భూ కబ్జాలపై ప్రశ్నిస్తున్న కవులు, కళాకారులను, జర్నలిస్టులను బహిరంగంగా హత్యలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో నిత్యం జర్నలిస్టును, మేధావులను బూతు పురాణంతో తిడుతూ... తీవ్రమైన బెదిరింపులకు పాల్పడుతున్న మూకలను ప్రభుత్వం నియంత్రించలేక పోతున్నది. వారికే వత్తాసు పలుకుతుండటం పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం వచ్చేసింది.
- బి గంగాధర్‌, ఎడిటర్‌ప్రణాళికాలు లేని... దేశాభివృద్ధిదేశంలో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పాలకపార్టీలు కృత్రిమంగా ఎన్నికల వాతావరాణాన్ని సృష్టిస్తున్నాయి. ప్రజలకు ఉన్న సమస్యలు పక్కా దారి పట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం దశాబ్ధి ఉత్సవాల పేరుతో ఇరవై రోజులపాటు కోట్లాది రూపాయాలు ఖర్చు పెట్టి ప్రభుత్వ కార్యక్రమాలను సైతం సొంత పార్టీ కార్యక్రమంగా మార్చుకున్నది. దశాబ్ధి ఉత్సవాలు ఆయావర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలు నేరవేర్చినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. నీళ్లు, నిధులు, నియమకాల పేరుతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం జరిగింది. లక్షల కోట్లు ఖర్చు చేసిన రైతులకు పూర్తిస్థాయిలో నీళ్లు అందించలేకపోతున్నది. రైతుల ఆరు నెలలు కష్టపడి పండించిన పంట కొనుగోలు చేయలేక, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్న రైస్‌ మిల్లర్ల దోపిడిని కట్టడి చేయలేక, రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసిన ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేసినట్లు ఉత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉంది.

నిధుల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ధనిక రాష్ట్రం పేరుతో ప్రజాప్రతినిధులు లక్షలాది రూపాలయాలను వేతనాలు అందుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల వేతనాలు చెల్లించడంలో విఫలం అవుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రతినెల రుణాలు తీసుకోకుంటే ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో కూడా నిధులు దుబారా ఖర్చు చేస్తున్న విషయం కాగ్‌ నివేదికలో పేర్కొనడం మనం గమనించాలి. వివిధ అభివృద్ధి పనులు చేసినబిల్లులు చెల్లించలేక సర్పంచ్‌ మొదలుకుని కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా ప్రభుత్వాల్లో చలనం కనిపించడం లేదు.
నియమాకాలు... ''ఊరందరిదీ ఓ దారైతే... ఉలిపి కట్టెది మరోదారి...'' అన్నట్టు ఉన్నది తెలుగు రాష్ట్రాల పరిస్థితి. కాంట్రాక్టు నియమాకాలు రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాటలు నీటిమీద రాతలు అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక ఖాళీలు ఉన్న, ఒక్క ఉద్యోగి రెండు, మూడు రకాల పనులు చేస్తున్నారు. ఇది మన పాలకులకు తెలియంది కాదు. కానీ అన్ని ఖాళీలు భర్తీ చేసినట్లు గ్లోబల్‌ ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. ప్రకటించిన నియమాకాలు సైతం భర్తీ చేయలేకపోతుంది. ప్రైవేటు పరిశ్రమల్లో కార్మికులు/ఉద్యోగులను ప్రభుత్వం భర్తీ చేసినట్లు తన ఖాతాలో వేసుకుంటుంది.

తన అధికారాన్ని ప్రశ్నిస్తున్న కవులు, కళాకారులను, మేధావులను, ప్రజా సంఘాల నాయకులను, ముఖ్యంగా జర్నలిస్టులను దేశద్రోహులుగా ముద్రవేస్తూ నల్లచట్టాల కింద అణచివేయాలని చూస్తుంది. ప్రశ్నించే వారిని లేకుండా చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. అవినీతి, భూ కబ్జాలపై ప్రశ్నిస్తున్న కవులు, కళాకారులను, జర్నలిస్టులను బహిరంగంగా హత్యలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో నిత్యం జర్నలిస్టును, మేధావులను బూతు పురాణంతో తిడుతూ... తీవ్రమైన బెదిరింపులకు పాల్పడుతున్న మూకలను ప్రభుత్వం నియంత్రించలేక పోతున్నది. వారికే వత్తాసు పలుకుతుండటం పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం వచ్చేసింది.

- బి గంగాధర్‌, ఎడిటర్‌

జర్నలిస్టులకు తప్పని తిప్పలు

జర్నలిస్టులకు తప్పని తిప్పలు


ఎందుకు నేను బీజేపీపైనే ఎక్కువ వీడియోలు చేస్తున్నాను? ముఖం చూపించలేని వాళ్లు, సొంత పేర్లు చెప్పుకోలేని ఫేక్ అకౌంట్స్ నుంచి ఘోరమైన కామెంట్స్, ఇన్ బాక్స్ మెసేజస్ వస్తున్నా నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను? ఇండిపెండెంట్ జర్నలిస్టుగా చెప్పుకుంటూ ఎక్కువ వీడియోలు బీజేపీని ప్రశ్నిస్తూ ఎందుకు చేస్తున్నాను? 

నేను చేసిన వీడియోలు మీరు చూశారా ఎంఐఎం బీజేపీ ఒక్కటే అని చాలా సార్లు చెప్పాను. బీజేపీని ఎందుకు వ్యతిరేకిస్తానో కూడా చెప్పాను. మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు అంటేనే ప్రజల్ని సమానంగా చూడట్లేదు అని అర్థం. బీజేపీ=ఎంఐఎం రెండింటి డీఎన్ఏ ఒకటి. ఒకటి పెద్ద పార్టీ రెండోది తోకపార్టీ అంతే తేడా. 

ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కంటే ఏ దేశానికీ అత్యంత ప్రమాదకరమైన విషయం మరొకటి ఉండదు. రాజ్యాంగం సాక్షిగా పాలిస్తామని చెప్పి ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి వచ్చినప్పట్నుంచి మెజారిటీ మతం వాళ్లను మైనారిటీ మతాలపైకి ఎగదోయడం కూడా విశాలమైన ఛాతీ ఉన్న రాజకీయాలేనా. వాజ్ పేయ్ ఇలా చెయ్యలేదే. మత మార్పిడులు జరగకుండా హిందూ మతంలో కులాన్ని పాతరెయ్యొచ్చు. మరి కుల నిర్మూలనకు తీసుకున్న చర్యలేంటి? గిరిజన రాష్ట్రపతి, బహుజన ప్రధాని ఉన్న దేశంలో మత రాజకీయాలు ఎందుకు? ఒక్క రాష్ట్రంలో అయినా మతం పేరు చెప్పకుండా ఎందుకు గెలవలేకపోతున్నారు..? 

అధికారంలో ఉన్నదే హిందూ పార్టీ యినప్పుడు.. 80 కోట్ల మంది హిందువుల్ని ఎవరు ఈ రోజు అభద్రతలోకి నెట్టేశారు? 75 ఏళ్లుగా లేని అభత్రత ఇప్పుడే వచ్చిందా. ఢిల్లీలో ఓ హిందు అమ్మాయిని ముస్లిం చంపేస్తే దాన్ని ఒక క్రైంగా చూడట్లేదు హిందువులపై దాడి అంటున్నారు. అదే హిందూ అమ్మాయిల్ని రోజూ వందల మందిని భర్తలూ, తండ్రులు, అన్నలూ, ప్రియుడు గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తోంటే ఎందుకు మాట్లాడరు? దేశంలో ఉగ్రవాదం ఉండకూడదు. అలాగని మీ స్నేహితున్నో, నా పక్కింట్లో ఉన్న సాధారణ ముస్లింలనో దోషులుగా చూపవచ్చా? ఇతర దేశాల్లో మనవాళ్లు ఉన్నారు, అక్కడొక హిందువులు క్రైం చేస్తే మొత్తం అందరినీ ఒకే గాటన కడితే మనకు ఎలా ఉంటుంది? ఇప్పుడు దేశంలో ఎక్కడ ఏం జరిగినా మతం కోణం ఎందుకు వస్తోంది? చివరికి బాలాసోర్లో రైలు ప్రమాదం జరిగిదే పక్కన మసీదు వల్లే, ఆ రోజు శుక్రవారం కాబట్టి అనేది తెరపైకి వచ్చింది. తీరా చూస్తే అది మసీదు కాదు ఇస్కాన్ టెంపుల్. తర్వాత స్టేషన్ మాస్టర్ ముస్లిం కావడం వల్లే ప్రమాదం అన్నారు తీరా చూస్తే ఆ స్టేషన్ మాస్టర్ మహంతి ఒక హిందువు. తర్వాత ఇప్పుడు ఇంజినీర్ అమీర్ అన్నారు.. ఇది కూడా తప్పుడు ప్రచారమే అని చివరికి రైల్వే డిపార్టెంట్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఒక ప్రమాదాన్ని ఇన్ని సార్లు మతం కోణంలో చూసి తప్పుడు ప్రచారాలు చేసి నాలుకు కరుచుకుంటున్నారు అంటే ఎంత ద్వేషం నింపేసి ఉండాలి సామాన్యుల బుర్రల్లోకి. చిన్న పిల్లలు కూడా ఇవాళ మతం గురించి మాట్లాడుతున్నారు అంటే ఈ పరిస్థితిలోకి ఎవరు నెట్టేశారు అంటే కారణం ఎవరు? మతాల పేరుతో కొట్టుకుచావనీనా భవిష్యత్తు తరాలు. ఇప్పటి ఈ విద్వేషం కాల్చేసేది మన పిల్లల్ని కాదా? సిరియా, ఆఫ్గనిస్థాన్ పాకిస్థాన్ ఈ దేశాల పక్కనా మనకు స్థానం కావాల్సింది? కుటుంబాల్లో, పిల్లల మనసుల్లో నాటుతున్న విష బీజాలు పెరిగి పెద్దయ్యాక ఎలాంటి ఫలితాలు ఇస్తాయో పాలకులు ఆలోచిస్తున్నారా? ఇప్పటి విద్వేషం రేపు ఎన్ని ఓట్లు తెస్తుంది అనే దగ్గరే వాళ్ల ఆలోచనలు ఆగిపోతున్నాయ్.. మర్నాడు మరో ఎన్నిక.. ఇంతే కదా నడుస్తోంది.. !?

ఇప్పుడు మనకు కావాల్సింది అమెరికాతో చైనాతో పోటీ పడే భారతదేశం కాదు... హిందూరాష్ట్రంగా ప్రకటించడమే మనక్కావాలి? పోనీ ఏమౌతుంది ప్రకటిస్తే.. ఏం మారుతుంది? విదేశాల్లో సెటిలైపోయిన ఒక్క నాయకుడి బిడ్డైనా తిరిగొచ్చేస్తుందా? ఒక్క సామాన్యుడి పరిస్థితి మారుతుందా..? మహా అయితే పుస్తకాల్లో సిలబస్ మారిపోతుంది. ఇంగ్లీష్ మినిమం అయ్యి హిందీ, సంస్కృతం వస్తుంది. అదే జరిగిదే చిన్న చిన్న చదువులకోసం కూడా విదేశాల బాట పట్టరా? అదా మనక్కావాల్సింది?  

రాను రాను మతాలు, కులాలు లేని భారతదేశాన్ని నిర్మించాలా లేదా కొకర్నొకరు ద్వేషిస్తూ కొట్టుకునే దేశం కావాలా? కేరళలో 32 వేల మంది అమ్మాయిలు ఐసిస్ లో చేరారా? మరి అన్ని మిస్సింగ్ కేసులు ఉండాలి కదా.. గుజరాత్ లో 40 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. తెలంగాణలో ఏపీలో అన్ని రాష్ట్రాల్లో వేలాది మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు వీళ్లంతా ఏమైపోతున్నట్లు? కేరళలో 3 కేసుల్లో ఇప్పటిదాకా కేసులు ఫైల్ అయ్యాయి, తల్లిదండ్రులు బయటికొచ్చారు, బాధితులు ఉన్నారు. మరి మిగతా  31వేల 997 కేసులు ఏవీ.. అంత మంది ఉగ్రవాద సంస్థల్లో చేరిపోతో ఎన్ని లక్షల మంది వాళ్ల తల్లిదండ్రులు, బంధువులు రోడ్లపైకి రావాలి.. వచ్చారా?  మరి ఎందుకీ ప్రచారం? ఆజాదీ కాశ్మీర్ సమస్య కాశ్మీర్లో ఉంది. కాశ్మీర్లో సాధారణ హిందువులు,సాధారణ ముస్లింలు కొట్టుకోవట్లేదు.. ఉగ్రవాదులు వేరు సాధారణ వ్యక్తులు వేరు. హిందువుల్లో క్రైస్తవుల్లో కూడా మతాన్ని అతిగా తీసుకొని ఇతరుల్ని ద్వేషించే వాళ్లు ఉంటారు. ఇది వ్యక్తుల సమస్య ఇక్కడికి రాజకీయం ఎందుకు తెస్తున్నారు.. సరే ఇదే బీజేపీ నార్త్ ఈస్ట్ లో క్రిస్టియన్ అనుకూల విధానాలు, హామీలు ప్రకటనలు చేసి గెలిచింది. అంటే ఎక్కడ ఏ మతం మెజారిటీ అయితే వాళ్లను పోలరైజ్ చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి రావడం ఇదేనా కావాల్సింది? 

మణిపూర్ ఆహుతి అయిపోతోంటే.. కనీసం ప్రధాని నుంచి శాంతి ప్రకటన కూడా ఎందుకు రావట్లేదు? కరోనా కష్టకాలంలో టీవీల్లో కనిపించి చెప్పిన మాట కనీసం మన్ కీ బాత్ లో అయినా చెప్పొచ్చు కదా.. నేనున్నాను.. మీ సమస్య పరిష్కరిస్తాను అని.. ఎందుకు చెప్పట్లేదు? చనిపోతున్న వాళ్లంతా మతం మారిన క్రైస్తవులే కాదు.. హిందువులూ చనిపోతున్నారు.. హిందువులైన మెయిటీల ఆస్తులూ ధ్వంసమౌతున్నాయ్.. మరి హిందువు కోణంలో అయినా ఒక ప్రకటన చెయ్యాలి కదా కేంద్రం. పోనీ గిరిజన మహిళ అయిన రాష్ట్రపతితో అయిన ప్రకటింపజేయవచ్చు కదా.. ఇవేవీ ఎందుకు జరగట్లేదు. నేను ఇది అడిగినా మీ దృష్టిలో దేశద్రోహి, హిందూ వ్యతిరేకి అయిపోతున్నాను. చేవ చచ్చిన కాంగ్రెస్ పార్టీని ఏమని అడుగుతాం ఈ దేశం గురించి..? అధికారంలో ఉన్న వాళ్లనే కదా అడగాలి..? 

పోనీ దేశంలో ఉన్న మెజారిటీ మతానికి ఏం మేలు చేసినట్లు? ఏ సామాన్యుడినైనా పిలిచి మతం చూసి ఓటు వేశావు కదా.. నీకు జరిగిన 3 గొప్ప మేళ్లు చెప్పు అంటే ఏం చెప్తాడు?పెట్రోల్ గ్యాస్ ధరలే కాదు.. టాక్స్ పరిధిలోకి రాని వస్తువులు ఎన్ని ఉన్నాయ్ ఇప్పుడు?రైళ్లలో సామాన్యులు కిక్కిరిసి కూర్చునే జనరల్ బోగీలను నిలువునా కోసేస్తున్నారు.. వృద్ధులకుండే రిజర్వేషన్ పూర్తిగా ఎత్తేశారు. 

పెన్షన్ల నుంచి కూడా రకరకాల కోతలతో నేరుగా వసూళ్లు చేస్తున్నారు. పరిశ్రమలు పెట్టక్కర్లేదు.. ఉన్న వాటిని సొంత ఆస్తిలా అమ్మేస్తున్నా అడగకూడదా? కనీసం ఒక పౌరురాలిగా అయినా అడిగే హక్కు ఉంటుంది కదా.. మీరు అడగరు.. నేను అడిగితే హిందూ వ్యతిరేకినా? బీజేపీని అధికారంలోకి తెచ్చింది గుజరాత్ మోడల్ చూసేగానీ మతాన్ని చూసి కాదు. మతం పేరుతోనే అయితే అద్వానీని చూపించే వాళ్లు 2014లో. గుజరాత్ వెలిగిపోతోంది.. భారత్ కూడా వెలిగిపోవాలి అంటే మోదీ రావాలి అని.. 

మోదీ వచ్చారు నల్లధనం వచ్చిందా, నోట్ల రద్దు తర్వాత గుర్తించిన నల్లధనం ఏమీ లేదు.. ఏదైనా చేశారు అంటే మళ్లీ రెండు వేల నోట్లు రద్దు చెయ్యడం.  మరి అకౌంట్లలో వేస్తాం అన్న రూ. 15 లక్షల మాటేంటి? ఇది ఎవరూ అడగకూడదు కదా..? అడిగితే దేశ ద్రోహి, ధర్మ ద్రోహి హిందూ వ్యతిరేకి.  జీఎస్టీ వల్ల కేంద్రానికి రెవెన్యూ పెరిగింది. కానీ పరిశ్రమలు మూతపడ్డాయి. చిన్న చిన్న వ్యాపారాలు నష్టాల్లోకి వెళ్లాయి. చిన్న హోటల్లో ఇడ్లీ తిన్నా జీఎస్టీ వేస్తున్నారు.. 

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాం అన్నారు..ఏవీ ప్రతి ప్రభుత్వ శాఖల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ్.. మన దేశంలో ఉండే సహజమైన అధిక జనాభా అనే పొటెన్షియాలిటీని బేస్ చేసుకొని, మనం చదువులకు ఇస్తున్న ప్రాముఖ్యతను క్యాష్ చేసుకునేందుకు చీప్ లేబర్ కోసం ఇక్కడికి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ప్రైవేట్ జాబ్స్ పెరిగాయ్.. మరి ప్రభుత్వ ఉద్యోగాలేవీ..? మేము నిరుద్యోగులం అని 29 కోట్ల మంది ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకున్నారు..? నమోదు చేసుకోని వాళ్లనూ కలిపితే..? 

కొంత మంది పారిశ్రామిక వేత్తల్నే ప్రోత్సహించడం వల్ల మార్కెట్లో మొనో పొలి పెరిగిపోయింది. ఇప్పుడు దేశం అంత భారీ స్థాయికి చేరుకున్న ఆ ఒకరిద్దురు పారిశ్రామిక వేత్తలకు ఏదైనా అయితే దేశ ఆర్థిక పరిస్థితి తలకిందులయ్యే స్థితికి ఎవరు కారణం? గ్యాస్, పెట్రోల్ ధరల ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడింది. గ్రామాల్లో మళ్లీ కట్టెపొయ్యలు ఎందుకు పెరిగాయో మీరు ఊరెళ్లినప్పుడు అడగండి ఆడవాళ్లు చెప్తారు. మీ ఫోన్ చెక్ చేసుకోండి మీకు బీజేపీ ఐటీ సెల్ నుంచి వండి వార్చిన మెసేజీలు మోడీ వల్ల దేశం వెలిగిపోతోంది అన్న మెసేజీలు, ఇతర మతాలపై ద్వేషం కలిగించే మెసేజీలు ఎన్ని వచ్చాయో చూసుకోండి. 

కొత్తగా ఆఫీసులో చేరిన వాళ్లు ఇప్పుడు వాళ్ల క్వాలిఫికేషన్స్ గురించి చూడట్లేదు, పక్కవాడి ఐడియాలజీ ఏంటి, వాడి మతం ఏంటి అని చూస్తున్నారు. క్రిస్టియనో, ముస్లిమో అయితే కొందరు హిందువులు ద్వేషిస్తున్నారు. నుదుటున కుంకం బొట్టుపెట్టుకున్న ఫ్రెండును చూస్తే ముస్లిం లేదా క్రిస్టియన్ ఉలిక్కిపడుతున్నారు. మన ఫ్రెండ్స్ లో ఆ అభద్రతకు కారణం ఎవరు? అంత అవసరం ఏంటి? పోనీ ఆలయాలకు ఏం చేశారు? అయోధ్యలోని రామమందిరమే కాదు అంతే విశిష్ఠత ఉన్న కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయం ఉంది, భద్రాద్రి రాముల వారి ఆలయం ఉంది.. వాటికి ఏం చేశారు? ఏమీ లేదు.. ఒక్క టెంపుల్ చూపించి దేశంలోని మొత్తం దేవాలయాలను నిర్వీర్యం చేస్తున్నది ఎవరు? ఈ రోజు అందరికంటే దయనీయ పరిస్థితి సగటు సామాన్య హిందువులది, గతంలో ప్రభుత్వాలపై కోపమొస్తే గట్టిగా రోడ్లపైకి వచ్చి నిలదీసే వాళ్లు. కానీ ఇప్పుడు ఎవరైనా కడుపుకాలి నోరెత్తితే.. హిందువై ఉండి హిందువుల్ని ప్రశ్నిస్తావా నువ్వు దేశద్రోహివీ, హిందూ ద్రోహివీ.. నీ మొగుడు/పెళ్లాం ముస్లిమా, నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియనా అంటున్నారు..

సామాన్య యువత(బడా బాబుల పిల్లలు కాదు) మెదళ్లు ఈ రోజు గొప్ప భవిష్యత్తు గురించో, శాస్త్రీయ దృక్పథం వైపో లేవు.. కేవలం తాము నమ్మిన మతాన్ని తమను రెచ్చగొడుతున్న మతాన్ని డిఫెండ్ చేసే స్థాయికి పడిపోయాయి.. ఇన్ని కోట్ల మెదళ్లు మతం చుట్టూ ఉన్నప్పుడు... నా లాంటి ఒక్కరో ఇద్దరో ఇలా చేస్తున్న మతోన్మాద పార్టీలను ప్రశ్నిస్తే మీకు చాలా కష్టం కలుగుతోంది. నాకు తెలుసు నాది ప్రమాదకరమైన ప్రయాణం.. ఎప్పుడో ఏ అమాయక యువకుడో నా మీద తను ప్రేమించే పార్టీ నింపిన విద్వేషాన్ని కత్తిగానో బుల్లెట్టుగానో మార్చి దాడి చేస్తాడని.. అలాగని కోట్లాది మంది యువత కళ్లముందు మతం మత్తులోకి జారుకుంటూ ఉంటే నేను చూస్తూ ఉండలేకనే నా పరిధిలో నేను చెప్పాల్సినవి చెప్తున్నాను. మత విద్వేషాలు మాత్రమే ఏ దేశయువతకైనా అత్యంత ప్రమాదకరం అని నేను చెప్తున్నందుకు నన్ను ద్వేషిస్తున్నారు, బూతులు తిడుతున్నారు.. నా ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. కానివ్వండి.. నన్ను డిఫెండ్ చె్యయడానికి ఏ పార్టీ ముందుకు రాదు నేను ఏ పార్టీ మద్దతుదారూ కాదు కాబట్టి.. ఏ కుల సంఘమూ రాదు.. నా కులమేంటో ఎవరికీ తెలీదు కాబట్టి.. ఏ గ్రూపూ నా కోసం నిలబడదు.. నాకు ప్రభుత్వం ఇచ్చే జర్నలిస్టు గుర్తింపు కార్డు సహా ఏ గుర్తింపూ లేదు కాబట్టి.. 

ఇలా ఒకరిద్దరికి నాకు తోచినప్పుడు వివరణ ఇవ్వడం కంటే ఇంకేమీ చెయ్యలేని అశక్తురాలిని.. ఏదో ఒక రోజు రాలిపోతాను, బలైపోతాను.. కానివ్వండి.. అలా అయ్యేలోపు కనీసం నా ఆవేదనను, ఏకాకిగొంతును రికార్డు చెయ్యనివ్వండి.  

- తులసి చందు,

Dalithashakthi - 2025 - Magazines